దళపతి విజయ్తో సన్నిహిత సంబంధాల్ని కొనసాగిస్తూ తమిళనాట వార్తల్లో నిలుస్తున్నది అగ్ర కథానాయిక త్రిష. తాజాగా సూర్య ‘కరుప్పు’ సినిమా విషయంలో నిర్మాతలకు, త్రిషకు మధ్య రాజుకున్న వివాదం చర్చనీయాంశంగా మారింది. ‘కరుప్పు’ చిత్రం ఈ నెల 14న తమిళ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్నది.
ఇరవైఏండ్ల విరామం తర్వాత సూర్యతో కలిసి త్రిష నటించిన చిత్రమిది కావడం విశేషం. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు త్రిషను దూరంగా పెట్టినట్లు కోలీవుడ్లో ప్రచారం జరుగుతున్నది. ఇటీవల నిర్వహించిన ఆడియో వేడుకలో కూడా త్రిష కనిపించలేదు. వేదికపై ఆమె గురించి ఎవరూ మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో చిత్రబృందంపై విమర్శలొస్తున్నాయి.
తాజాగా త్రిష తాలూకు లుక్ వీడియోను శుక్రవారం రిలీజ్ చేశారు. దీనిపై త్రిష వ్యంగ్యంగా స్పందించింది. ఈ సినిమాలో తాను నటించిన విషయాన్ని మర్చిపోయానని, కనీసం ఈ వీడియోతో గుర్తుచేసినందుకు థాంక్స్ అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. దీంతో నిర్మాతలు, త్రిష మధ్య నిజంగానే వివాదాలు తలెత్తాయని చెన్నై సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.