ఒక్క భారీ హిట్ చాలు కథానాయికల జాతకం మారిపోవడానికి. బాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి విషయంలో అదే జరిగింది. ‘యానిమల్’ సినిమాతో ఈ భామ యువతరంలో తిరుగులేని ఫాలోయింగ్ను సంపాదించుకుంది. అంతకుముందు ఈ సొగసరి హిందీలో ఐదు చిత్రాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. ‘యానిమల్’తో ఒక్కసారిగా అగ్ర కథానాయికల జాబితాలో చేరిపోయింది.
ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రం ద్వారా ఈ భామ తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం త్రిప్తి డిమ్రి తెలుగులో మరో భారీ ప్రాజెక్ట్లో భాగం కాబోతున్నట్లు తెలిసింది. నాని కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కబోతున్నది. ఇందులో త్రిప్తి డిమ్రిని కథానాయికగా ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే చిత్రబృందం ఆమెను సంప్రదించిందని, త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.