వరలక్ష్మీ శరత్కుమార్, అవికాగోర్, బిందు మాధవి, నందు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘మాన్షన్ 24’. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. డిస్నీ హాట్స్టార్లో ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. బుధవారం ట్రైలర్ను ఆవిష్కరించారు. ఓంకార్ మాట్లాడుతూ ‘ఈ సిరీస్లో ఆరు ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్గా సాగుతాయి. ప్రతి ఎపిసోడ్ సరికొత్త పాయింట్తో ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ అంతా చూసేలా ఉంటుంది’ అన్నారు. వరలక్ష్మీ శరత్కుమార్ మాట్లాడుతూ ‘హారర్ థ్రిల్లర్ కథాంశమిది. నా క్యారెక్టర్కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. వినూత్నమైన కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న సిరీస్లో భాగం కావడం ఆనందంగా ఉంది’ అని చెప్పింది.
ఇదే కార్యక్రమంలో తనపై వచ్చిన డ్రగ్స్ కేసు గురించి మాట్లాడింది వరలక్ష్మీ శరత్కుమార్. మాదక ద్రవ్యాల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ నుంచి తనకు నోటీసులు అందాయన్న ప్రచారంలో వాస్తవం లేదని వరలక్ష్మీ శరత్కుమార్ స్పష్టం చేసింది. ‘గతంలో ఆదిలింగం అనే వ్యక్తి నా దగ్గర ఫ్రీలాన్స్ మేనేజర్గా పనిచేశారు. ఆయన తీసుకొచ్చిన నాలుగు చిత్రాల్లో నటించా. అంతేకానీ అతని వ్యక్తిగత జీవితం గురించి నాకు ఏమీ తెలియదు. డ్రగ్స్ కేసులో ఆయన ఉన్నారంటూ వార్తలొచ్చాయి. దాంతో కొందరు నా ఫొటోను వాడుకొని కథనాలు రాశారు. అంతేతప్ప డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని వరలక్ష్మీ శరత్కుమార్ పేర్కొంది. ‘మాన్షన్ 24’ సిరీస్కు సంగీతం: వికాస్ బాడిస, నిర్మాతలు: ఓంకార్, అశ్విన్ బాబు, కల్యాణ్ చక్రవర్తి.