‘నేడు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా మంచి సినిమా ఏ భాషలో విడుదలైనా ఆదరిస్తున్నారు. ఇటీవల క్రిస్టి, ఇరట్ట, రోమాంచం వంటి మలయాళ చిత్రాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇటీవల విడుదలైన మరో మలయాళ సూపర్హిట్ చిత్రం ‘2018’ అనూహ్య ప్రేక్షకాదరణతో కేవలం మౌత్టాక్తో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడం ఎంతో సంతోషంగా వుంది’ అన్నారు ప్రముఖ నిర్మాత బన్నీవాస్. మలయాళ చిత్రం ‘2018’ చిత్రాన్ని ఆయన తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెల 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బన్నీవాస్ మాట్లాడుతూ ‘2018’ ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాల వలన కేరళలో భారీ వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఇందులో సుమారుగా 164 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళ చరిత్రలో ఇవే అతిపెద్ద వరదలు. ఈ వరదల నేపథ్యంలో జుడ్ ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించిన చిత్రమిది. కేవలం 15 రోజుల్లోనే మలయాళంలో రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. కేరళలోని మారుమూల పల్లెలో జరిగే కథ ఇది. దొంగ సర్టిఫికెట్తో ఆర్మీలో చేరి అక్కడ ఉండటం ఇష్టం లేక పారిపోయి వచ్చే యువకుడి పాత్రలో టోవినో థామస్ అనూప్ కనిపిస్తాడు. తప్పకుండా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు.