దక్షిణాది చిత్రాలపై ప్రశంసలు కురిపించింది అగ్ర కథానాయిక మృణాల్ ఠాకూర్. ఇక్కడి వారు సినిమాను ప్రాణంగా ప్రేమిస్తారని, సృజనాత్మకంగా ఆలోచిస్తారని చెప్పింది. ‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ భామ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్నది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ ‘తెలుగు సినిమాలో భాగం కావడం నటిగా నా దృక్పథాన్ని మార్చివేసింది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషా చిత్రాల్లో చాలా ప్రత్యేకతలు కనిపిస్తాయి.
స్క్రిప్ట్ దశలోనే ప్రతీ పాత్రను అద్భుతంగా డిజైన్ చేస్తారు. తెరపై కథను ఆవిష్కరించే విధానం కూడా చాలా సహజంగా ఉంటుంది. షూటింగ్కు ఎక్కువ సమయం తీసుకున్నా సరే అవుట్పుట్ విషయంలో మాత్రం రాజీ పడరు. తాము అనుకున్న సన్నివేశం తెరపై వచ్చేంత వరకు శ్రమిస్తారు’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో విజయ్ దేవరకొండ, నాని చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది.