న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో ఐటీ కంపెనీలు ఇక పూర్తిగా ఇంటి నుంచి పని పద్ధతికి మారిపోయాయి. పలు రంగాలకు చెందిన కంపెనీలు వైట్ కాలర్ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయాలని కోరాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఐబీఎం, రేమాండ్, మోతీలాల్ ఓస్వాల్, డెలాయిట్, శాప్ ఇండియా వంటి దిగ్గజ కంపెనీలు సిబ్బంది అంతటినీ ఇంటి నుంచే పనిచేయాలని, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరాయి. ఇక అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి కాలు బయటపెట్టవద్దని ఇన్ఫోసిస్ సీఓఓ ప్రవీణ్ రావు ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ లో కోరారు.
బయటకు వెళ్లినప్పుడు విధిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. జూన్ చివరి వరకూ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని టీసీఎస్, ఐబీఎంలు కోరగా శాప్ ఇండియా ల్యాబ్స్ తమ బెంగళూర్ క్యాంపస్ లో అర్హులైన ఉద్యోగులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టింది. మరోవైపు ఐటీసీ సైతం తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని ముందస్తు అనుమతి లేనిదే ఏ ఒక్కరూ కార్యాలయానికి రావద్దని కోరింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో మే 1 నుంచి 18 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.