దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతి సందర్భంగా జూన్ 4న తెలుగు చిత్రసీమ ఆయనకు స్వరనీరాజనం అందించబోతున్నది. తెలుగు చిత్రసీమతో పాటు భారతీయ సినీ రంగానికి బాలు చేసిన అసమాన సేవల్ని గుర్తుచేస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పించేందుకు తెలుగు చిత్రసీమ మొత్తం కదిలిరానున్నది. జూన్ 4వ తేదీని బాలసుబ్రహ్మణ్యంగారికి అంకితం చేస్తూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పన్నెండు గంటల పాటు ఇంటర్నెట్ వేదికగా లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేయబోతున్నారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ ‘బాలు గౌరవార్ధం ఏర్పాటుచేయనున్న ఈ కార్యక్రమంలో తెలుగు సినీ ప్రముఖులంతా పాల్గొనబోతున్నారు’ అని తెలిపారు.