ఆదిలాబాద్ రూరల్; మే 22: హరితహారం కింద నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని దుర్గానగర్లో గల అర్బన్పార్కులో పెరుగుతున్న మొక్కలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు ఎకరాల్లో అర్బన్ పార్కును ఏర్పాటు చేసి చిట్టడవులను పెంచే బాధ్యతను తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది నాటికి చిట్టడవుల స్థాయిలో మొక్కలు తయారై ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయని తెలిపారు. ఆయన వెంట ఇంజినీరింగ్ అధికారులు తిరుపతి, అరుణ్ ఉన్నారు.
నూతన యంత్రాల పరిశీలన
కరోనాతో మరణించిన వారి అంత్యక్రియల నిర్వహణ కోసం ఆదిలాబాద్ మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో రూ.20లక్షలతో ఏర్పాటు చేసిన దహన సంస్కార ప్రత్యేక యంత్రం ఉపయోగానికి సిద్ధమైంది. మావల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన యంత్రాన్ని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పరిశీలించారు. ఒక రోజు పది శవాలను దహనం చేయవచ్చని, అరగంటకు ఒకటి చొప్పున దహన సంస్కారాలు నిర్వహించవచ్చని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ అధికారులు ఉన్నారు.