సినీరంగంలో నెలకొని ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వివిధ విభాగాల ప్రతినిధులతో విస్త్రతంగా చర్చలు జరుపుతున్నది. షూటింగ్లు నిలిపివేసిన క్రమంలో తిరిగి పరిశ్రమను పట్టాలెక్కించేందుకు ఈ సంధి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నది. ఈ క్రమంలో గురువారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా అగ్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘తెలుగు సినీ రంగానికి ఫిల్మ్ ఛాంబరే సుప్రీం. చిత్రసీమలోని సమస్యల పరిష్కారానికి నాలుగు కమిటీలు ఏర్పాటు చేశాం.
వీపీఎఫ్ ఛార్జీలు, ఓటీటీ, రెవెన్యూ పర్సంటేజీలు, సినీ కార్మికుల వేతనాలు, నిర్మాణ వ్యయాలపై ఈ నాలుగు కమిటీలు పనిచేస్తాయి. నెలల తరబడి షూటింగ్స్ బంద్ చేసే ఉద్దేశ్యం మాకు లేదు. నిర్మాతలందరూ కలిసి నాపై ఎక్కువ బాధ్యత పెట్టారు. అంతేకాని నాకు వ్యక్తిగత అజెండాలేవీ లేవు. పరిశ్రమ కోసమే నేను పనిచేస్తున్నా. త్వరగా సమస్యల్ని పరిష్కరించుకొని చిత్రీకరణలు పునఃప్రారంభించే యోచనలో ఉన్నాం’ అన్నారు. నిర్మాతల మండలి, ప్రొడ్యూసర్ గిల్డ్ అందరి లక్ష్యం ఒకటేనని, నిర్మాతల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాల్లేవని సి.కల్యాణ్ తెలిపారు. ఈ సమావేశంలో నిర్మాతలు ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, దామోదరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మంచు విష్ణుని కలిసిన దిల్రాజు
‘మా’అధ్యక్షుడు మంచు విష్ణుతో అగ్ర నిర్మాత దిల్రాజు గురువారం ఉదయం సమావేశమయ్యారు. తెలుగు సినిమాల్లో ‘మా’ సభ్యులకు ఎక్కువగా అవకాశాల్ని కల్పించాలని, కొత్తవారు ‘మా’లో సభ్యత్వం తీసుకునేలా ప్రోత్సహించాలని దిల్రాజుని మంచు విష్ణు కోరారు. ఈ మేరకు ‘మా’ సంక్షేమ కమిటీ వినతి పత్రాన్ని దిల్రాజుకు అందజేశారు.