ఏపీ ప్రభుత్వం (AP Government) సినిమా టికెట్ల ధరలు (movie ticket prices)తగ్గించిన నేపథ్యంలో సినిమా థియేటర్లు మూతపడుతున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil raju) ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఏపీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పలువురు సినీ పెద్దలు సభ్యులుగా ఉన్నారని ఈ సందర్భంగా దిల్ రాజు అన్నారు.
హీరో నాని వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ తనదైన శైలిలో కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దయచేసి ఎవరూ వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయొద్దు. త్వరలోనే సమస్యకు పరిష్కారం వస్తుందని దిల్ రాజు అన్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి ఏపీ సీఎం, మంత్రులను కలవాలనుకుంటున్నాం. మాకు అపాయింట్మెంట్ ఇస్తేనే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని (YS Jagan Mohan Reddy) కలుస్తాం. సినిమా, మీడియా రెండు వేరు కాదు. త్వరలోనే కమిటీ ద్వారా జీవో వస్తుందని ఆశిస్తున్నాం. కమిటీ నిర్ణయం తర్వాత మాట్లాడతామని దిల్ రాజు చెప్పారు.
త్వరలోనే ఏపీ ప్రతినిధులను కలుస్తామని..టికెట్ ధరలపై త్వరలోనే క్లారిటీ వస్తుందని దిల్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ అంతా ఒకటే. ప్రభుత్వం అటు ప్రేక్షకులను ఇటు ఇండస్ట్రీని బ్యాలెన్స్ చేయాలి. కమిటీలో ఉన్నవాళ్లు ప్రభుత్వానికి అన్ని వివరిస్తారు. మేం ప్రభుత్వాన్ని సానుకూల వాతావరణంలో కలిసేందుకు రెడీగా ఉన్నాం. మంచి సినిమాలు తీయాలి. ప్రేక్షకులకు చూపించాలనేదే మా లక్ష్యం. మాకు, ప్రభుత్వానికి వారధి మీడియా అని దిల్ రాజు అన్నారు.
డిస్ట్రిబ్యూటర్లకు మంత్రి పేర్ని నాని అపాయింట్ మెంట్
ప్రభుత్వం నిర్ణయంతో థియేటర్లను నడపలేమని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు సన్నద్దమయ్యారు. టికెట్ రేట్ల తగ్గింపు వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్నినానిని కలువనున్నారు. మంత్రి పేర్ని నాని అపాయింట్ కోసం ప్రయత్నించగా.. కేవలం డిస్ట్రిబ్యూటర్లకు మాత్రమే అపాయింట్ మెంట్ ఇచ్చారు. మంగళవారం డిస్ట్రిబ్యూటర్ల బృందం మంత్రిని కలిసి సమస్యలను వివరించనుంది.