హైదరాబాద్ : ఏపీలో సినిమా థియేటర్లు మూసివేస్తుంటే ఏడుపొస్తుందని ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. శ్యామ్సింగరాయ్ చిత్రం సక్సెస్మీట్ సోమవారం హైదరాబాద్లో జరిగింది. కార్యక్రమంలో ఆర్ నారాయణమూర్తి, ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ సినిమా తీసేవాడు, చూపించేవాడు, చూసేవాడుంటే పరిశ్రమ బాగుంటుందన్న ఆయన.. థియేటర్లు మూసివేయొద్దని యజమానులకు సూచించారు. ఈ విషయంలో నిర్మాతల మండలి, ‘మా’ జోక్యం చేసుకొని.. సినీ పరిశ్రమను కాపాడుకోవాలన్నారు.
పండుగవేళ పరిశ్రమకు గడ్డు పరిస్థితి రావొద్దని, యజమానుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ప్రస్తుత పరిస్థితులపై సినీ పరిశ్రమ పెద్దలు దృష్టి పెట్టాలని, సినీ పరిశ్రమపై ఏపీ సీఎం జగన్ సానుకూలంగా స్పందించాలని కోరారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ హీరో నానిని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకూడదన్నారు. నాని చెప్పిన విషయం వేరు.. అది వెళ్లిన తీరుగా ఉందని.. నాని వ్యాఖ్యలను వక్రీకరించడం తప్పన్నారు. థియేటర్ల గురించి నాని ఎంతో భావోద్వేగంతో మాట్లాడారన్నారు.