IT Raids | హైదరాబాద్లో ఇన్కం ట్యాక్స్ దాడులు రెండోరోజైన బుధవారం కొనసాగుతున్నాయి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా పెట్టుబడులపై ఆరా తీస్తున్నారు. పుష్ప-2 సినిమాకు పెట్టిన బడ్జెట్.. వచ్చిన ఆదాయంపై అధికారులు ఎంతో తెలుసుకునే పనిలో పడ్డారు. ఆయా సంస్థలు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ భారీగా ఉండడంతో ఐటీ అధికారుల రెండోరోజు సైతం తనిఖీలు చేపడుతున్నారు. మంగళవారం నుంచి హైదరాబాద్ నగర పరిధిలోని ఎనిమిది చోట్ల ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు 55 బృందాలు రంగంలోకి దిగాయి.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంతో పాటు కార్యాలయాలు, మైత్రి మూవీ మేకర్స్ యజమాని నవీన్, సీఈవో చెర్రి, మ్యాంగో మీడియాలోనూ సోదాలు చేస్తున్నారు. ఐటీ దాడులు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ ఇటీవల భారీగా కలెక్షన్లు వసూలు చేసినట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు జరిగినట్లు తెలుస్తున్నది. అసలు సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎంత..? వచ్చిన ఆదాయం ఎంత? అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు ఇటీవల పలు సినిమాలకు భారీగా పెట్టుబడి పెట్టామని.. సినిమా ఇంత బిజినెస్ చేసిందని మేకర్స్ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా పెట్టుబడులు.. వచ్చిన ఆదాయం.. కడుతున్న ఇన్కం ట్యాక్స్ విషయంలో అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నట్లు సమాచారం.