న్యూఢిల్లీ: ఓవైపు పెరిగిపోతున్న కరోనా కేసులు, మరోవైపు ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్న ఈ సమయంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) ఓ వరాన్ని అందించింది. ఎస్పీఓ2 (బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్) సప్లిమెంటల్ ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్ను అభివృద్ది చేసింది. ఈ డివైస్ను అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో దేశ రక్షణ కోసం పాటుపడుతున్న సైనికులు ఉపయోగించవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పేషెంట్లకు కూడా ఈ డివైస్ బాగా ఉపయోగపడనుంది.
అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమించే సైనికుల కోసం కొత్త కొత్త వ్యవస్థలను అభివృద్ధి చేసే డీఆర్డీవో ఇప్పుడు కూడా మరో వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీనిని ఎత్తయిన ప్రదేశాల్లో ఉండే సైనికులు ఉపయోగించవచ్చు. అయితే ప్రస్తుతం దేశంలో ఉన్న సంక్షోభ సమయంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కూడా ఈ పరికరం ఉపయోగపడుతుంది అని డీఆర్డీవో ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఏంటీ పరికరం?
ఇంట్లోనే కరోనా చికిత్స తీసుకునే పేషెంట్లకు ఇది బాగా పనికొస్తుంది. అలాంటి పేషెంట్లకు ఇది ఆక్సిజన్ ఫ్లో థెరపీ అందజేస్తుంది. బెంగళూరులోని డిఫెన్స్ బయో ఇంజినీరింగ్ & ఎలక్ట్రో మెడికల్ లేబొరేటరీ దీనిని అభివృద్ధి చేసింది. ఈ పరికరం పేషెంట్ మణికట్టుకు పెడితే అది ఎప్పటికప్పుడు శరీరంలోని ఎస్పీఓ2 లెవల్స్ను పరిశీలిస్తుంటుంది. ఎప్పుడైనా రక్తంలో ఆక్సిజన్ స్థాయి పడిపోయినట్లు అనిపిస్తే వెంటనే సప్లిమెంట్ను శరీరంలోకి పంపిస్తుంది. దీనివల్ల సదరు పేషెంట్ హైపోక్సియాలోకి వెళ్లకుండా అడ్డుకుంటుందని డీఆర్డీవో తెలిపింది.
కణజాలానికి సరిపడా ఆక్సిజన్ అందని పరిస్థితుల్లో మనిషి హైపోక్సియాకు గురవుతాడు. ప్రస్తుతం కొవిడ్ పేషెంట్లలో జరుగుతోంది ఇదే. వాళ్ల రక్తంలో ఎప్పటికప్పుడు ఆక్సిజన్ స్థాయిలను గుర్తించి అందిస్తుంటే హైపోక్సియా నుంచి రక్షించవచ్చు. ఈ పరికరం చేసే పని అదే. ఆక్సిజన్ కొరత ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా ఉపకరిస్తుంది.