తిరువీర్, పావని కరణం జంటగా నటిస్తున్న సినిమా ‘పరేషాన్’. ఈ చిత్రాన్ని వాల్తేరు ప్రొడక్షన్స్ పతాకంపై సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. రూపక్ రోనాల్డ్సన్ దర్శకుడు. జూన్ 2న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు హీరో తిరువీర్. ఆయన మాట్లాడుతూ…‘దర్శకుడు రూపక్ ఈ సినిమా కోసం నాలుగు సీన్ల ఆడిషన్ అడిగారు. ఆ నాలుగు సీన్లలో నటిస్తున్నప్పుడు సినిమా ఎంత కొత్తగా ఉంటుందో అర్థమైంది. దాంతో కథ వినకుండానే అంగీకారం తెలిపాను. సింగరేణి ప్రాంతంలో దర్శకుడు చూసిన యువకుల జీవితం, అక్కడి స్నేహాలు, ఊరిలోని సామాజిక జీవనం వంటి అంశాలతో ఈ సినిమాను రూపొందించారు.
సహజంగా ఉండేందుకు అక్కడి లొకేషన్స్లోనే చిత్రీకరణ జరిపాం. మంచిర్యాల, రామకృష్ణాపురం, బీజోన్, గద్దెరాగడి వంటి ఊర్లలో షూటింగ్ చేశాం. స్థానిక నటీనటులను తీసుకున్నాం. ఇక్కడి లొకేషన్స్ చూస్తుంటే మరో కేరళలా అనిపించింది. ఈ కథలోని పాత్రలన్నీ అమాయకంగా ప్రవర్తిస్తుంటాయి. ఆ అమాయకత్వం నుంచే వినోదం పుడుతుంది. తెలంగాణ నేపథ్య సినిమాను విశాఖపట్నం నిర్మాతలు నిర్మించడం విశేషం. మా చిత్రంలో రానా భాగస్వామి కావడం సంతోషంగా ఉంది. సినిమా ప్రచారంలోనూ పాల్గొంటూ సొంత సినిమాలా ప్రమోట్ చేస్తున్నారు’ అన్నారు.