Rashmika Mandanna | డిమాండ్ అండ్ సైప్లె సూత్రం ఏ వ్యాపారంలోనైనా వర్తిస్తుంది. క్రేజ్ను క్యాష్ చేసుకునే చిత్ర పరిశ్రమలో ఇది మరికాస్త ఎక్కువే. కలిసొచ్చిన కాలాన్ని ఉపయోగించుకోవాలనే ఆలోచన నాయిక రష్మిక మందన్నలోనూ కనిపిస్తుంది. అందుకే ‘పుష్ప’ సినిమా దేశవ్యాప్తంగా విజయం సాధించిన తర్వాత తన పారితోషికాన్ని ఆమె బాగా పెంచేసిందని పరిశ్రమలో టాక్ వినిపిస్తున్నది. ఆమె తన కొత్త సినిమాలకు 3 నుంచి 5 కోట్ల రూపాయల వరకు ఫీజు వసూలు చేస్తున్నదట. గతంలో నాయికలు కోటి రూపాయలు తీసుకుంటేనే ఆశ్చర్యపోయేవారు.
బాలీవుడ్ తారలకు మాత్రమే ఈ స్థాయి ఫీజులు ఉండేవి. దక్షిణాది సినిమా దేశీయంగా ఆదరణ పొందుతున్న నేపథ్యంలో స్థానిక తారలూ ఆదాయం విషయంలో ముందు జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు వారి క్రేజ్ పాన్ ఇండియాకు చేరడంతో పారితోషికాలు కూడా ఆ స్థాయిలోనే ఉంటున్నాయి. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రంలో నాయికగా నటిస్తున్నది. దీంతో పాటు దర్శకుడు వెంకీ కుడుముల, నితిన్ కాంబినేషన్లో ఓ చిత్రంలో నటిస్తున్నది. ఇది కాకుండా హిందీలో ఆమెకు రణబీర్ కపూర్ సరసన ‘యానిమల్’ సినిమా ఉంది.