ఓటీటీ ధాటికి విలవిల్లాడుతున్న థియేటర్లు ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రూపాయికే 30 నిమిషాలపాటు అప్కమింగ్ సినిమాల ట్రైలర్ వీక్షించే ఆఫర్ను తీసుకొచ్చాయి. కేవలం ఒక్క రూపాయి టికెట్ మీద అచ్చంగా అరగంట కొత్త సినిమాల ట్రైలర్లు ఎంజాయ్ చేయొచ్చన్నమాట! పీవీఆర్-ఐనాక్స్ మల్టీప్లెక్స్లు ఈ కొత్త విధానానికి తెరలేపాయి. సినిమా టికెట్ ధరలు ఇంతే ఉండాలని నిర్ణయించిన రాష్ర్టాలు మినహాయించి మిగతా రాష్ర్టాల్లోని పెద్ద నగరాల్లో ఈ రూపాయి ట్రైలర్ బొనాంజా హంగామా సృష్టిస్తున్నది.
మాల్స్కు వచ్చినవాళ్లు పనిలోపనిగా రూపాయి చెల్లించి థియేటర్లో అరగంటపాటు కాలక్షేపం చేస్తున్నారు. భారీ బడ్జెట్తో, సకల హంగులతో రూపుదిద్దుకున్న సినిమా ట్రైలర్లు టీవీలో, ఫోన్లో చూస్తే అంత థ్రిల్ ఇవ్వకపోవచ్చు. అవే ట్రైలర్లు భారీ స్క్రీన్ల మీద, డాల్బీ సౌండ్ ఎఫెక్ట్తో చూస్తే.. ఆ కిక్కే వేరుంటుంది. సదరు ట్రైలర్ చూసిన ప్రేక్షకుడిలో ‘ఈ సినిమా థియేటర్లోనే చూడాల’న్న ఆసక్తి కూడా ఏర్పడుతుంది. ఓటీటీ క్రేజ్ రోజురోజుకూ పెరుగుతున్న వేళ.. వీలైనంత మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలని మొదలుపెట్టిన ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి!