తెలుగునాట సంక్రాంతి సందడి ముగిసింది. ఈ ఏడాది బాక్సాఫీస్ బరిలో దిగిన పందెంకోళ్ల మధ్య పోటీ కాస్త రసవత్తరంగానే సాగింది. సుదీర్ఘ విరామం తర్వాత అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ సంక్రాంతి బరిలో తలపడటం కొత్త ఊపును తీసుకొచ్చింది. పండగ పోటీ ఎలా ఉన్నా.. ‘వాల్తేరు వీరయ్య’ ‘వీరసింహా రెడ్డి’ ‘వారసుడు’ చిత్రాలు మంచి వసూళ్లను సాధించి విజేతలుగా నిలిచాయి. మొత్తంగా సంక్రాంతి సీజన్ తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త ఉత్సాహా నిచ్చింది. ఇప్పుడు సినీ ప్రియుల దృష్టి మొత్తం వేసవి సినిమాల వైపు మళ్లింది. సంక్రాంతి తర్వాత తెలుగు పరిశ్రమలో వేసవి సీజన్కు కూడా అంతటి ప్రాముఖ్యత ఉంటుందన్న విషయం తెలిసిందే. మరి ఈ వేసవిలో ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతున్న సినిమాలపై
ఓ లుక్కేద్దాం..
‘దసరా’తో మొదలు…
నాని నటిస్తున్న ‘దసరా’ చిత్రంతో ఈ వేసవి సీజన్కు తెరలేవనుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచమమవుతున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. తెలంగాణ సింగరేణి నేపథ్య కథాంశంతో తెరకెక్కించారు. చిత్రీకరణ పూర్తయింది. ఇందులో నాని పూర్తి మాస్ అవతారంలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 30న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’
రవితేజ నటిస్తున్న మరో యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ పతాకాలపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. అనూఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కార్, పూజిత పొన్నాడ కథానాయికలుగా నటిస్తున్నారు. రవితేజ లాయర్ పాత్రను పోషిస్తున్న ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ హంగులతో తెరకెక్కిస్తున్నారు. రవితేజను మునుపెన్నడూ చూడని విధంగా కొత్త రీతిలో ప్రజెంట్ చేయబోతున్నారు దర్శకుడు సుధీర్వర్మ. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. ఏప్రిల్ 7న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది.
మరో హిట్కోసం మెగాస్టార్
ఈ సంక్రాంతి బరిలో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ద్వారా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు చిరంజీవి. ఈ ఏడాది కూడా ఆయన డైరీ ఖాళీ లేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ను ఆస్వాదిస్తూనే ఇటీవల ఆయన ‘భోళా శంకర్’ సెట్స్లోకి అడుగుపెట్టారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోహర్ రమేష్ దర్శకుడు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్నది. కోల్కతా సెట్లో చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నది. తమన్నా కథానాయిక. యాక్షన్, సెంటిమెంట్ అంశాల కలబోతగా రూపొందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది.
సిద్ధమైన ‘పొన్నియన్ సెల్వన్-2
చోళ సామ్రాజ్య నేపథ్య ఇతివృత్తంతో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రం గత ఏడాది సంచలనం సృష్టించింది. 183 కోట్లతో తమిళ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఐదొందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష వంటి భారీ తారాగణంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించారు దర్శకుడు మణిరత్నం. రెండో భాగం ఏప్రిల్ 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది.
‘జైలర్’ వాయిదా పడే అవకాశం?
రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘జైలర్’. సన్పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్రాన్ని తొలుత ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సిని మా విడుదల ఆగస్ట్కు వాయిదా పడ్టట్లు తెలిసింది. ఏప్రిల్ 28న ‘పొన్నియన్ సెల్వ న్-2’ రిలీజ్ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద చిత్రాల పోటీని నివారించడానికి ‘జైలర్’ను వాయిదా వేశారని చెన్నై సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మేలో నాగచైతన్య ‘కస్టడీ’
గత కొంతకాలంగా సరైన విజయాలు లేక సతమతమవుతున్నారు నాగచైతన్య. దాంతో తన తాజా చిత్రం ‘కస్టడీ’ పై ఆయ న భారీ అంచనాల్ని పెట్టుకున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కిస్తున్న సినిమాగా ‘కస్టడీ’ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందులో సీనియర్ నటుడు అరవింద్స్వామి విలన్గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. నాగచైతన్య పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం మే 12న విడుదలకు సిద్ధమవుతున్నది. ఇక సాయిధరమ్ తేజ్ నటిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ ‘విరుపాక్ష’ ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకురానుంది. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు.
మహేష్-త్రివిక్రమ్ చిత్రం ఆలస్యం
మహేష్బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న చిత్రం ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 28న విడుదల కావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల వేసవి బరి నుంచి ఈ సినిమా తప్పుకుంది. రెండు రోజుల క్రితమే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్లో మొదలైంది. అతడు, ఖలేజా వంటి చిత్రాల తర్వాత మహేష్బాబు-త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.