నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ ద్వారా బిడ్డల్ని పొందారంటూ వస్తున్న వార్తలపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. వీరు నిబంధనల ప్రకారమే సరోగసీ ద్వారా సంతానాన్ని పొందారా? లేదా? అనే విషయంపై ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ విచారణకు ఆదేశించారు. తమకు కవల పిల్లలు కలిగినట్లు విఘ్నేష్ ఆదివారం వెల్లడించారు. దీంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
జూన్ 9న పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగు నెలల్లోనే బిడ్డల్ని పొందారంటే సరోగసీ ద్వారానే వీలైందని అంటున్నారు. సరోగసీ ద్వారా పిల్లల్ని పొందడాన్ని ఈ ఏడాది జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. సంతానం లేని దంపతులు వైద్యుల ధ్రువీకరణతో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే సరోగసీ ద్వారా సంతానాన్ని పొందవచ్చు. దీనికి చట్టంలోని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.