అడివి శేష్ హీరోగా నటించిన సినిమా ‘మేజర్’. ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. సయీ మంజ్రేకర్, శోభిత ధూలిపాళ్ల నాయికలుగా నటించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి ఆదరణ పొందుతున్నదని చిత్రబృందం చెబుతున్నారు. తాజాగా హైదరాబాద్లో సక్సెస్మీట్ నిర్వహించారు. అడివి శేష్ మాట్లాడుతూ…‘మేజర్ సందీప్కు మేమిచ్చిన నివాళి ఈ సినిమా.
ఇదొక ఆరంభం మాత్రమే. ఇలాంటి గొప్ప చిత్రాలను ఇంకా రూపొందించాలని అనుకుంటున్నాం. ఈ సినిమా చూసి సైన్యంలో చేరుతామనంటూ చాలా మంది చెప్పడం సంతోషంగా ఉంది. సైన్యంలోకి వెళ్లాలనుకుని, పేదరికంతో సరైన శిక్షణ లేని వాళ్లందరికీ మేము ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నాం.
ఆ కార్యక్రమాన్ని కూడా మేజర్ సందీప్ పేరుమీదే చేస్తాం’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ…‘మేజర్ సందీప్ మా టీమ్ను నడిపించాడు. ఆయన ఒక సైనికుడిగా ఎంత గొప్పగా బతికాడో మా సినిమా ద్వారా చూపించడం గర్వంగా ఉంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ వీర సైనికుడికి నివాళి అర్పిస్తున్నారు’ అన్నారు.