The Elephant Whisperers | అనాథ ఏనుగుల్ని చేరదీసి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకున్న బొమ్మన్, బెల్లి నిజ జీవితగాథ ఆధారంగా రూపొందిన ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యుమెంటరీ’ ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. కార్తికి దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీని గునీత్ మోంగా నిర్మించారు. ఆస్కార్ గెలుచుకున్న తొలి భారతీయ డాక్యుమెంటరీ చిత్రంగా ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ సంచలనం సృష్టించింది.
తమిళనాడు ముడుమలై ఫారెస్ట్ రిజర్వ్ ప్రాంతంలో రఘు, అమ్ము అనే అనాథ ఏనుగు పిల్లల్ని చేరదీసిన గిరిజన దంపతులు వాటి ఆలనాపాలన కోసం ఎంతో శ్రమించారు. మూగజీవాలతో వారు పెంచుకున్న అనుబంధం, అడవి ఒడిలో సాగిన దంపతుల జీవిత ప్రయాణాన్ని ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ డాక్యుమెంటరీలో హృద్యంగా ఆవిష్కరించారు.
తాజాగా చెన్నైలో ఆస్కార్ అవార్డును బొమ్మన్, బెల్లి దంపతుల చేతికందించి తన మనసులోని సంతోషాన్ని పంచుకుంది దర్శకురాలు కార్తికి. ఈ సందర్భంగా తన సోషల్మీడియా ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ‘ఆస్కార్ అవార్డును ఈ దంపతుల చేతిలో చూడటం గొప్ప అనుభూతి. ఇదే అసలైన ఆనందం’ అంటూ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్మీడియాలో అందరిని ఆకట్టుకుంటున్నది.