ఈ ఏడాది మన దేశం నుంచి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ఆస్కార్ నామినేషన్ పొందింది ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’. ఈ డాక్యుమెంటరీని గునీత్ మోంగా, అచిన్ జైన్ నిర్మించారు. కార్తీకి గోన్సాల్వెస్ దర్శకత్వం వహించారు. మూడుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో రఘు, అమ్ము అనే రెండు ఏనుగు పిల్లలను సంరక్షించిన బొమ్మన్, బెల్లీ అనే దంపతుల కథతో ఈ డాక్యుమెంటరీ రూపొందింది. ప్రకృతి, జంతుజాలంతో మనిషికి ఉండే భావోద్వేగ అనుబంధాలను దీంట్లో హృద్యంగా ఆవిష్కరించారు. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్కు నామినేట్ అవడం దేశీయంగా డాక్యుమెంటరీ నిర్మాణ దశను మార్చనుందనే ఆశాభావం వ్యక్తమవుతున్నది.
ఈ నేపథ్యంలో దర్శకురాలు కార్తీకి గోన్సాల్వెస్ మాట్లాడుతూ…‘విశిష్టమైన సంస్కృతి, జీవి వైవిధ్యానికి నెలవు మన దేశం. ఇక్కడ డాక్యుమెంటరీలుగా తెరకెక్కించేందుకు ఎన్నో అంశాలున్నాయి. అయితే డాక్యుమెంటరీలు ఎప్పుడూ కొందరి వ్యక్తిగత ఆసక్తి మేరకు తెరకెక్కుతున్నాయి. ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న వీటి నిర్మాణం, పంపిణీ ఫిలిం మేకర్స్కు నష్టాలనే తీసుకొస్తున్నది. పేరున్న నిర్మాణ సంస్థలు ముందుకొచ్చి ప్రోత్సహిస్తే ఎన్నో వైవిధ్యమైన డాక్యుమెంటరీలు తెరపైకి వస్తాయి. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆ మార్పు తీసుకొస్తుందని ఆశిస్తున్నా’ అని చెప్పింది.