Tollywood | సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతున్నది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు అందరి చూపు ఈవీల వైపునకు మళ్లుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఈవీ వాహనాల వినియోగానికి అందిస్తున్న ప్రోత్సాహంతో కంపెనీలు పెద్ద ఎత్తున ఈవీలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అందులో భాగంగానే మహానగరంలో ఈవీల సంఖ్య కొనుగోళ్లు పెరుగుతున్నాయి. మరోవైపు సినీ హీరోలు కూడా ఈవీల బాటే పడుతున్నారు. ఈ పరిణామాలతో మార్కెట్లో ఈవీ వాహన కొనుగోళ్లకు డిమాండ్ పెరిగిందని షోరూం నిర్వాకులు తెలిపారు. మొన్న మెగాస్టార్ చిరంజీవి 1.9కోట్లతో టొయోటా వెల్ఫైర్ (ఎలక్ట్రిక్ అండ్ పెట్రోల్) కారు కొనుగోలు చేయగా నిన్న సినీ హీరో రవితేజ రూ. 34.49లక్షలతో బీవైడీ-ఏటీటీఓ 3 ఎలక్ట్రిక్ కారును తీసుకున్నారు. ఇప్పుడు అదే బాటలో హీరో అల్లరి నరేశ్ రూ. 64.95లక్షలతో కియా ఈవీ6 జీటీ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో శుక్రవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. కాగా అతడి కారుకు టీఎస్09జీబీ2799 నంబర్ను కేటాయించారు. ఇలా నగరంలో ఈవీల కొనుగోలు జోరందుకుంది.
ఈవీ వాహనాల్లో సదరు కంపెనీలు పోటాపోటీగా మార్కెట్లోకి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్లతో వెహికిల్స్ను తీర్చిదిద్దుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న టొయోటా నుంచి విడుదలైన ఈ వెల్ఫైర్లో అద్భుతమైన, అత్యాధునికమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఫీచర్లతో పాటు భద్రతపరమైన అంశాలు బోలెడు ఉన్నాయి. హైస్పెసిఫికేషన్స్తో విడుదలైన ఈ మల్టీపర్పస్ వెహికిల్లో మూడు వరుసలు ఉంటాయి. ఏడుగురు దర్జాగా కూర్చొని జర్నీ చేయొచ్చు. ట్విన్ సన్రూఫ్, త్రీజోన్ ైక్లెమేట్ కంట్రోల్, 13 అంగుళాల ఎంటర్టైన్మెంట్ స్క్రిన్స్ లాంటి ప్రత్యేకతలున్నాయి. దీనికి 2.5 పెట్రోల్ ఇంజిన్తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటర్లు కూడా ఉన్నాయి. ఇక కియా నుంచి వచ్చిన ఈవీ6 జీటీ లైన్ ఏడబ్ల్యూడీ కారు ఒక్కసారి ఫుల్ చార్జింగ్కు 708 కిలో మీటర్ల దూరం ప్రయాణించొచ్చు. కేవలం 18 నిమిషాల్లో 80శాతం బ్యాటరీ సిద్ధమవుతుంది. ఇది ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్. 77.4కిలో వాట్స్ బ్యాటరీ. సీటింగ్ కెపాసిటీ 5. ఆటోమెటిక్ ైక్లెమెట్ కంట్రోల్ ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే ఇటీవల రవితేజ తీసుకున్న బీవైడీ ఏటీటీఓ 3ఈవీ కార్ ఫుల్ ఛార్జింగ్తో 521 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. ద్విచక్ర వాహనాలు కూడా ఇలాంటి అనేక ఫీచర్లతో ఆదరణ పొందుతున్నాయి.