‘గోపీచంద్ గతంలో కొన్ని పోలీస్ పాత్రలు చేశారు. కానీ ఇలాంటి పోలీస్గా చేయడం మాత్రం ఇదే ప్రథమం. ప్రస్తుతం ప్రేక్షకులు ఇలాంటి కథలను బాగా ఆదరిస్తున్నారు. తప్పకుండా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే సినిమా అవుతుంది’ అన్నారు నిర్మాత కె.కె.రాధామోహన్. గోపీచంద్ హీరోగా ఆయన నిర్మించిన చిత్రం ‘భీమా’. ఏ.హర్ష దర్శకుడు ఈ నెల 8న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడారు. ‘ఇటీవల విడుదలైన గోపీచంద్ సెకండ్ లుక్, ట్రైలర్లోని కొన్ని సన్నివేశాలను చూసి చాలామంది ఈ సినిమాను ‘అఖండ’తో పోలుస్తున్నారు. నిజానికి ఈ సినిమాతో ‘అఖండ’కు ఏమాత్రం సంబంధంలేదు. ట్రైలర్లో చూపించిన పరశురామక్షేత్రం బెంగళూరు, బాదామీ పరిసరాల్లో ఉంటుంది.
ఆ క్షేత్రం నేపథ్యంలో జరిగే కథ ఇది. ట్రైలర్లో కనిపిస్తున్న అఘోరాలు, శివాలయం ఇవన్నీ కేవలం యాంబియన్స్ కోసమే. అంతే తప్ప అఘోరాలకూ ఈ కథకూ ఎలాంటి సంబంధం లేదు’ అని తెలిపారు రాధామోహన్. సినీ నిర్మాణం రిస్క్తో కూడుకున్న బాధ్యత అని, ప్రేక్షకుల అభిరుచికి తగ్గ కథను ఎంచుకోవడం, కథకు తగ్గ పాత్రధారులను ఎన్నుకోవడం, సరైన సాంకేతిక నిపుణులను తీసుకోవడం… ఇవన్నీ చిన్న విషయాలు కావనీ, దర్శకుడు హర్ష క్లారిటీ ఉన్న దర్శకుడు కాబట్టే, తనను దాదాపుగా ఇబ్బందిపెట్టలేదని, ఇందులో రెండు పాటలకు తనే కొరియోగ్రఫీ కూడా చేశాడని నిర్మాత చెప్పారు. ‘ కథ డిమాండ్ మేరకు భారీ సెట్టింగులు నిర్మించాం. ఇందులోని వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ తెరపై ఓ అద్భుతాన్ని చూస్తున్న అనుభూతికి లోనుచేస్తాయి’ అని చెప్పారు. బిజినెస్ పరంగా కూడా హ్యాపీగా ఉన్నామని, డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమాపై ఆసక్తిని కనపరిచారని ఆయన ఆనందం వెలిబుచ్చారు.