Tharun Bhascker | తెలుగు సినిమా రంగంలో కొత్త తరానికి చెందిన ప్రతిభావంతులైన దర్శకుల్లో తరుణ్ భాస్కర్ ఒకరు. తనదైన శైలిలో కథలు చెబుతూ, యూత్ను ఆకట్టుకునే మేకింగ్తో ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. 2016లో విడుదలైన ‘పెళ్లి చూపులు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన తొలి ప్రయత్నంతోనే జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవడం విశేషం. ఈ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకోగా, ఉత్తమ మాటల రచయితగా కూడా తరుణ్ భాస్కర్కు గౌరవం దక్కింది. సహజమైన కథనం, సహజ సంభాషణలు, నేటి యువత ఆలోచనలకు దగ్గరగా ఉండే సన్నివేశాలతో ఆయన ఒక ప్రత్యేక దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెరకెక్కించిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం యూత్లో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించి, ఆయనను యువ దర్శకుల్లో ముందువరుసలో నిలబెట్టింది.
దర్శకత్వంతో పాటు నటుడిగానూ తన ప్రతిభను చాటుకున్న తరుణ్ భాస్కర్ ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రంలో హీరోగా నటించగా, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించి మెప్పించారు. ఇటీవల విడుదలైన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమాలో నటుడిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు తరుణ్ భాస్కర్. ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి మంచి స్పందన అందుకుంటోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తరుణ్ భాస్కర్, ప్రస్తుతం రీమేక్ సినిమాల సంఖ్య తగ్గుతున్న తరుణంలో ఈ చిత్రానికి ప్రేక్షకులు ఇస్తున్న ఆదరణ తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. కథ మలయాళ నేపథ్యంలో మొదలైనప్పటికీ, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా పూర్తిగా కొత్త వాతావరణాన్ని సృష్టించామని చెప్పారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల నేపథ్యాన్ని తీసుకోవడం వల్ల ప్రేక్షకులు దీన్ని ఒరిజినల్ సినిమాలానే ఆదరిస్తున్నారని తెలిపారు. మంచి కథ ఉంటే ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారనే విషయం మరోసారి రుజువైందన్నారు.
ప్రస్తుతం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ‘ఈ నగరానికి ఏమైంది 2’ సినిమా సిద్ధమవుతోంది. తొలి భాగంతో పోలిస్తే ఈ సీక్వెల్ మరింత పెద్ద స్థాయిలో ఉండబోతోందని, పాత్రలు కూడా ఆసక్తికరంగా మలచుతున్నామని తెలిపారు. ఇక సీనియర్ హీరో వెంకటేష్తో చేయాల్సిన ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ, గుర్రపు పందేల నేపథ్యంతో కథ సిద్ధం చేసినప్పటికీ స్క్రిప్ట్ రెండో భాగంపై తనకు పూర్తి సంతృప్తి కలగలేదని చెప్పారు. అందుకే ఆ ప్రాజెక్ట్ను తాత్కాలికంగా నిలిపివేసి, సమయం దొరికినప్పుడు మరింత మెరుగులు దిద్దాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఆ సినిమా రద్దు కాలేదని, సరైన సమయంలో తప్పకుండా వెంకటేష్తో ఈ కథను తెరపైకి తీసుకొస్తానని స్పష్టం చేశారు. దర్శకుడిగా ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే నటుడిగా కొత్త సవాళ్లను స్వీకరిస్తున్న తరుణ్ భాస్కర్ ప్రయాణం టాలీవుడ్లో ఆసక్తికరంగా మారుతోంది.