తెలుగు వెండితెర ఇప్పుడు తెలంగాణ యాస, భాషల పరిమళాలతో గుభాళిస్తున్నది. తరాలుగా అవహేళనలు ఎదుర్కొన్న చోటే తనదైన అస్తిత్వ పతాకాన్ని ఎగరేస్తూ సాంస్కృతిక పునరుజ్జీవానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం తెలుగు చిత్రసీమలో తెలంగాణ కళాకారులు, సాంకేతిక నిపుణులు అవకాశాల్ని అందిపుచ్చుకొని రాణిస్తున్నారు. ‘ఫిదా’ మొదలుకొని నేటి ‘దసరా’ వరకు తెలుగు తెరపై తెలంగాణ నేపథ్య ఇతివృత్తాలకు అద్భుతమైన ఆదరణ లభిస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కారణమని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.
ఒకప్పుడు సినిమాల్లో వివక్షకు గురైన తెలంగాణ యాస నేడు సమున్నత గౌరవాన్ని పొందుతున్నదని ఆనందం వ్యక్తం చేశారు. ప్రముఖ వైద్యుడు డా॥ దండె శ్రీరాములు వాట్సప్ మెసేజ్లను ట్విట్టర్లో పోస్ట్ చేశారు కేటీఆర్. “బలగం, దసరా వంటి చిత్రాలు తెలంగాణ యాసతో చక్కటి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. తెలంగాణ చరిత్రలో ఇదొక మైలురాయి. ఈ ఘనతకు కారణం కేసీఆర్ గారే. ఇప్పుడు నా వయసు 68 సంవత్సరాలు. తెలంగాణ యాస, భాషల్ని జోకర్లు, విలన్ల మీద చిత్రీకరిస్తున్నారే కారణంతో గత ఇరవై ఏళ్లుగా సినిమాలు చూడటం మానేశాను. కానీ ఈ రోజు ఇంతటి మార్పు వస్తుందని కలలో కూడా ఊహించలేదు’ అంటూ డా॥ దండె శ్రీరాములు తన సందేశాల్లో పేర్కొన్నారు. ఆయన అనుమతి తీసుకొని వాట్సప్ స్క్రీన్షాట్లను మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పెట్టారు.