సీనియర్ తెలుగు సినీ దర్శకుడు పి.చంద్రశేఖర్రెడ్డి(86)సోమవారం ఉదయం చెన్నైలో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1933 అక్టోబర్ 15న నెల్లూరు జిల్లాలోని అనుమసముద్రం గ్రామంలో జన్మించారాయన. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో 80 సినిమాలకు దర్శకత్వం వహించారు. 1959లో ‘శ్రీ కృష్ణ రాయభారం’ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్గా చంద్రశేఖర్రెడ్డి సినీ ప్రయాణం ప్రారంభమైంది. దర్శకుడిగా చంద్రశేఖర్రెడ్డి పరిచయం విచిత్రంగా జరిగింది. ఆయన దర్శకత్వం వహించిన ‘విచిత్ర దాంపత్యం’, ‘అత్తలు కోడళ్లు’ సినిమాలు ఒకే రోజున విడుదలయ్యాయి. అరంగేట్ర దర్శకుడి రెండు సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకురావడం అరుదని చెప్పవచ్చు. హీరో కృష్ణతో చంద్రశేఖర్రెడ్డికి చక్కటి అనుబంధముంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇరవై మూడు సినిమాలు రూపొందడం గమనార్హం. ఎన్టీఆర్ హీరోగా చంద్రశేఖర్రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘బడిపంతులు’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్బాబు, కృష్ణంరాజుతో పాటు అగ్రహీరోలందరితో సినిమాలు చేశారాయన.
చిరంజీవి ద్విపాత్రాభినయంలో ప్రయోగాత్మకంగా చంద్రశేఖర్రెడ్డి తెరకెక్కించాలని భావించిన ‘చిన్న పులి-పెద్ద పులి’ చిత్రం అనివార్య కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. అన్నయ్య, భీష్మ, బుద్ధ లాంటి టీవీ సీరియల్స్కు ఆయన దర్శకత్వం వహించారు. చంద్రశేఖర్రెడ్డి భార్య చాలా కాలం క్రితమే మరణించారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తమ కుటుంబానికి ఆప్తుడైన చంద్రశేఖర్రెడ్డిని కోల్పోవడం బాధాకరమని సీనియర్ హీరో కృష్ణ సంతాపాన్ని వ్యక్తంచేశారు. తమ ఇద్దరి కలయికలో వచ్చిన ఇల్లు ఇల్లాలు, కొత్త కాపురం, పాడిపంటలు, నా పిలుపే ప్రభంజనం చిత్రాలు పెద్ద విజయాల్ని సాధించాయన్నారు.