తెలుగు సినిమా స్వర్ణయుగపు నాయికల్లో అద్భుత సౌందర్యం, అసమాన నటన మేలికలయికగా ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంది జమున. తెలుగింటి సత్యభామగా అందరిని మెప్పించింది. అందం, అభినయం, ఆత్మాభిమానం ఆమెకు అలంకారాలుగా భాసిల్లాయి. సుదీర్ఘ నట ప్రస్థానంలో ఎన్నో పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసింది జమున. తెలుగు తెరపై అత్యధిక సంవత్సరాలు నాయికగా కొనసాగిన రికార్డు ఆమె సొంతం. వెండితెర అందాలరాశిగా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన జమున నిష్క్రమణంతో తెలుగు చిత్రసీమలో ఓ సువర్ణాధ్యాయం ముగిసినట్లయింది.
తొలితరం నటశిఖామణి జమున (86) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 150 చిత్రాల్లో నటించారామె. ఆమె విలక్షణ వ్యక్తిత్వం నటించే పాత్రల్లోనూ ప్రతిబింబించేది. జమునకు కొడుకు వంశీ కృష్ణ, కూతురు స్రవంతి ఉన్నారు. ఆమె భర్త రమణారావు 2014లో గుండెపోటుతో మరణించారు. జమున మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె కూతురు స్రవంతి చేతుల మీదుగా జమున అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం జూబ్లిహిల్స్లోని మహాప్రస్థానంలో ముగిశాయి.
తొమ్మిదేళ్ల వయసులోనే..
జమున కర్ణాటకలోని హంపిలో 1936 ఆగస్ట్ 30న జన్మించారు. ఆమెను మెచ్చుకోలుగా ‘హంపీ సుందరి’ అని పిలిచేవారు. అయితే జమున పెరిగిందంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో. ఆమె తండ్రి నిప్పాణి శ్రీనివాసరావు గుంటూరులో పొగాకు వ్యాపారం చేసేవారు. తల్లి కౌసల్యాదేవి చక్కటి సంగీత విద్వాంసురాలు. జమునకు తల్లిదండ్రులు ముందుగా పెట్టిన పేరు జనాబాయి. జన్మనక్షత్రం రీత్యా జమునగా పేరు మార్చారు. దుగ్గిరాల బాలికల పాఠశాలలో జమున విద్యాభ్యాసం సాగింది. పాఠశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేది. తొమ్మిదేళ్ల వయసులోనే నాటకాలు వేయడం మొదలుపెట్టింది. మాభూమి, దిల్లీ ఛలో, విందు వంటి నాటకాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ‘విందు’ అనే నాటికలో యశోద పాత్రను పోషించడంతో పాటు దర్శకత్వం, సంగీత బాధ్యతలు నిర్వర్తించింది.
‘పుట్టిల్లు’తో సినీరంగ ప్రవేశం..
ప్రజా నాట్యమండలిలో చురుకైన పాత్ర పోషించిన డా॥ రాజారావు తీసిన ‘పుట్టిల్లు’ చిత్రం ద్వారా జమున కథానాయికగా వెండితెరపై అరంగేట్రం చేసింది. సినీరంగ ప్రవేశం సాఫీగానే సాగినా.. తొలి రెండు చిత్రాలు పుట్టిల్లు, వద్దంటే డబ్బు పరాజయం పాలవడంతో ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర పడింది. అనంతరం ‘అంతా మనవాళ్లే’ చిత్రంతో జమునకు తొలివిజయం దక్కింది. ఇక అక్కడి నుంచి ఆమె సినీ ప్రయాణం అప్రతిహత విజయాలతో సాగింది.
తెలుగింటి సత్యభామ
జమున పేరు వినగానే తొలుత సత్యభామ పాత్రే గుర్తుకు వస్తుంది. అలకలు, కులుకులతో చిర్రుబుర్రులాడుతూ అందం, అమాయకత్వంతో సమ్మోహన పరిచే సత్యభామ పాత్రలో జమున అభినయం అనితరసాధ్యం. సముద్రాల రాఘవాచార్య దర్శకత్వంలో వచ్చిన ‘వినాయక చవితి’ చిత్రంలో జమున తొలిసారి సత్యభామ పాత్రను పోషించింది. అయితే 1966లో వచ్చిన ‘శ్రీకృష్ణ తులాభారం’ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జమున చేసిన సత్యభామ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది. ‘శ్రీకృష్ణ విజయం’ చిత్రంలో కూడా జమున సత్యభామ పాత్రలో మెప్పించింది. సత్యభామ పాత్ర గురించి జమున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘సత్యభామ అందగత్తె, చక్కటి విద్యావంతురాలు. అన్నింటికంటే ముఖ్యంగా ఓ పోరాటయోధురాలు. నరకుణ్ణి వధించిన వీరనారి. ఆమె వ్యక్తిత్వంలో ఆత్మాభిమానం, రాజసం తొణికిసలాడతాయి. నా స్వభావం అలాంటిదే. అందుకే నాకు సత్యభామ పాత్ర బాగా కలిసొచ్చింది’ అని చెప్పింది.
నాలుగేళ్ల పాటు బహిష్కరణ
ఎన్టీఆర్, ఏఎన్నార్లతో వచ్చిన ఇగో సమస్యలతో వారి సినిమాల్లో నటించకుండా జమునను నాలుగేళ్ల పాటు ఇండస్ట్రీ నుంచి బహిష్కరించడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే జమున రాజీలేని తత్వంతో హిందీ సినిమాలపై దృష్టిపెట్టి అక్కడ విజయాల్ని అందుకొంది. తెలుగులో నాయికా ప్రధాన చిత్రాల్ని ఎంచుకొని సత్తాచాటింది. చివరకు చక్రపాణి, కేవీ రెడ్డి ఈ వ్యవహారంలో కలుగజేసుకొని రాజీ కుదిర్చారు. అనంతరం ఏఎన్నార్ ‘గుండమ్మ కథ’, ఎన్టీఆర్ ‘గులేబకావళి కథ’ చిత్రాల్లో జమున కథానాయికగా నటించింది.
ఆరోగ్యంపై ప్రభావం చూపిన ప్రమాదం
కెరీర్ ఆరంభంలో జరిగిన ప్రమాదం జమున సినీ కెరీర్పై ఎంతో ప్రభావాన్ని చూపింది. ‘లేత మనసులు’ తమిళ వెర్షన్ సంబంధించిన పాట షూటింగ్లో హీరో జయశంకర్ గడ్డివాము మీద నుంచి మెల్లగా జారుకుంటూ కథానాయిక జమున పక్కన వచ్చి చేరాలి. అయితే పట్టుతప్పి ఆయన నేరుగా జమున నెత్తిమీద పడటంతో మెడభాగం మీద తీవ్ర ఒత్తిడి పడింది. కొన్నేళ్ల తర్వాత ఆ గాయం తాలూకు దుష్ప్రభావాలు మొదలయ్యాయి. మెడ నరాలు దెబ్బతినడంతో మాట్లాడే సమయంలో ఊగిపోతూ కనిపించేది. ఎంత మంది వైద్యుల్ని సంప్రదించినా సరైన చికిత్స దొరకలేదు.
మరపురాని చిత్రం ‘బంగారు తల్లి’
జమున కేవలం పౌరాణిక, కుటుంబ కథా చిత్రాలే కాదు నర్గీస్దత్ చేసిన ప్రయోగాత్మక చిత్రం ‘మదరిండియా’ తెలుగు రీమేక్ ‘బంగారుతల్లి’లో కథానాయికగా నటించింది. అప్పటికే నాయికగా ఉన్నత స్థితిలో ఉన్న జమున ఆ సినిమాకు ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరచింది. చాలా మంది నిర్మాతలు వొద్దని వారించారు. మార్కెట్ దెబ్బతింటుందని, అవకాశాల మీద ప్రభావం చూపుతుందని చెప్పారు. అయినా ధైర్యంగా ముందుకెళ్లి ఆ సినిమాలో నటించింది జమున. తాపీ చాణక్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాలో జమున అభినయానికి నర్గీస్దత్ ఫిదా అయింది. ఓ వేడుకలో ‘బహుత్ అచ్చా కియా’ అంటూ జమునను ప్రశంసించింది.
హిందీలో పన్నెండు సినిమాలు
నయా ఆద్మీ (1956) చిత్రం ద్వారా జమున హిందీ చిత్రసీమలో అడుగుపెట్టారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ఒకే ఒక్క హిందీ చిత్రమది. హిందీలో 18 చిత్రాల్లో నటించారామె. అన్ని చిత్రాలకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది. ‘మూగమనసులు’ హిందీ రీమేక్ ‘మిలన్’ జమునకు హిందీలో నటిగా మంచి బ్రేక్నిచ్చింది. ఈ చిత్రం రజతోత్సవం జరుపుకోవడంతో పాటు జమునకు ఫిలింఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. 2008లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు జమున.
కలిసిరాని రాజకీయాలు
జమునకు రాజకీయాలు మాత్రం అంతగా కలిసి రాలేదు. రాజీవ్గాంధీ ప్రోత్సాహంతో 1989లో రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం మధ్యంతర ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొంతకాలం పనిచేసిన ఆమె ఆ తర్వాత వాజ్పేయి మీద గౌరవంతో బీజేపీలో చేరారు. అనంతరం క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు. పాలిటిక్స్ నుంచి వైదొలగినా రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య అధ్యక్షురాలిగా వారి శ్రేయస్సుకు విశేషంగా కృషి చేశారు.
అత్యధిక కాలం కథానాయికగా రికార్డు
హీరోలతో పోల్చితే కథానాయికల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. తెలుగులో పాతికేళ్ల పాటు కథానాయికగా రాణించింది ఒక్క జమునే కావడం విశేషం. 1952లో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె దాదాపు 25 ఏళ్ల పాటు అగ్ర కథానాయికగా రాణించింది. కెరీర్ సజావుగా కొనసాగుతున్న తరుణంలోనే జమున సినిమాల నుంచి తప్పుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె ఏ చిత్రంలోనూ నటించలేదు. ప్రేక్షకులు తనను కథానాయికగానే గుర్తుంచుకోవాలనే కోరికతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించలేదని జమున చాలా సందర్భాల్లో చెప్పారు.
సంతోషాల కుటుంబం
స్థిరమైన కుటుంబాన్ని నిర్మించుకోవడంలో సినీ తారలు ఇబ్బందులు పడుతుంటారు. వరుస కట్టే అవకాశాలు ఒకవైపు, పెండ్లి విషయంలో ఇంట్లో ఒత్తిడి మరోవైపు..ఈ పరిస్థితుల్లో సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. కానీ జమున తన వైవాహిక జీవితం విషయంలో స్పష్టమైన అవగాహనతో ఉండేది. నాయికగా వెలుగుతున్న సమయంలోనే 1965లో ఎస్వీ యూనివర్సిటీలో అధ్యాపకులు రమణారావుతో ఆమె వివాహం జరిగింది. కలతలు లేని కాపురం వీరిది. జమున, రమణారావుకు ఇద్దరు సంతానం. కొడుకు వంశీ కృష్ణ, కూతురు స్రవంతి ఉన్నారు. తమ పిల్లలను చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంచారు జమున. కొడుకు వంశీ కృష్ణ అమెరికాలో మాస్ కమ్యూనికేషన్స్ చేశారు. 2014లో రమణారావు 86 ఏండ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటి నుంచి కూతురు స్రవంతి తల్లి జమునతో కలిసి హైదరాబాద్లోనే ఉంటున్నది.
అందం, అభినయం కలబోతగా..
30ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మరపురాని పాత్రల్లో మెప్పించింది జమున. ‘గుండమ్మకథ’ చిత్రంలో అల్లరి, పెంకితనం కలబోసిన సరోజ పాత్రలో ఆమె అభినయం చిరకాలం గుర్తుండిపోతుంది. ఇక సత్యభామగా ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘గులేబకావళి కథ’ చిత్రంలో ఆమె అందచందాలు వర్ణింప సాధ్యం కాదు. ‘మిస్సమ్మ’ చిత్రంలో సీత పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు అద్భుతంగా అనిపిస్తుంది. ‘పండంటి కాపురం’ చిత్రంలో మాలినీదేవి పాత్రలో గుమ్మడి, రంగారావు వంటి ఉద్ధండులతో పోటాపోటీగా నటనను కనబరచింది. ‘సంపూర్ణ రామాయణం’ చిత్రంలోని కైక పాత్ర జమున నటజీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది. దాదాపు 150 చిత్రాల్లో నటించింది జమున. అన్నపూర్ణ, జగపతి, సురేష్ ప్రొడక్షన్స్ వంటి పెద్ద సంస్థల తొలి సినిమా కథానాయిక జమున కావడం విశేషం.
పరిశ్రమకు తీరని లోటు
దిగ్గజ నటి జమున మృతి వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి నాయికగా గొప్ప పేరు తెచ్చుకుంది. జమున గారి ఆత్మకు శాంతి చేకూరాలి.
-సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
అశేష ప్రేక్షకాభిమానం పొందారు
వివిధ భాషల్లో దాదాపు 150 చిత్రాల్లో నటించిన జమున దేశవ్యాప్తంగా అశేష ప్రేక్షకాదరణ పొందారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా ప్రజా సేవ చేశారు. ఆమె మృతి బాధాకరం. జమున గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
– అనిల్ కుర్మాచలం, ఎఫ్డీసీ ఛైర్మన్
మనసుల్లో చెరగని ముద్ర వేశారు
జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారాన్ని కలుగజేసింది. ఆమె బహుభాషా నటి. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
– చిరంజీవి
సత్యభామగా మెప్పించారు
అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, మంచి ఇల్లాలిగా, తెలుగు వారి సత్యభామగా..ఇలా ఎన్నో పాత్రల్లో మెప్పించారు జమున గారు. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక భాషల్లో నటించి ప్రేక్షకాభిమానం పొందారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి.
– బాలకృష్ణ
చిరకాలం గుర్తుంటారు
జమున గారి మృతి వార్త కలచివేసింది. ఆమె మనకు ఎప్పటికీ గుర్తుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు.
– మహేష్ బాబు
నిన్నటితరం నాయికల ప్రతినిధి
వెండితెరపై నిన్నటితరం నాయికలకు ప్రతినిధి జమున గారు. వెండితెరపై విభిన్న పాత్రలు పోషించారు.
– పవన్ కళ్యాణ్