చెన్నై: ఆయన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి. ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే షెడ్యూల్ ప్రకారం కాకుండా.. రెండు గంటలు ఆలస్యంగా వచ్చారు. దీంతో ఇంత ఆలస్యం ఎందుకయింది, మీకోసం చాలా మంది వేచిఉన్నారని అని ఓ విలేఖరి మంత్రిని ప్రశ్నించారు. దీంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. ఆవేశంతో ఊగిపోతూ ఆ రిపోర్టర్పై దూసుకొచ్చిన ఘటన తమిళనాడులోని శివగంగ జిల్లాలో జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
శివగంగా జిల్లా కేంద్రంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ముఖ్యఅతిథిగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఆర్ పెరియకరుప్పన్ హాజరయ్యారు. అయితే ఉదయం 10 గంటలకు ప్రారంభమవ్వాల్సిన ఆ ప్రోగ్రామ్.. మంత్రి ఆలస్యంగా రావడంతో మధ్యాహ్నం తర్వాత కాని మొదలవ్వలేదు. దీంతో కార్యక్రమం ముగిసిన తర్వాత ఓ విలేఖరి.. మీ కోసం ఇంత మంది ఎదురుచూశారు, ఆలస్యానికి గల కారణమేమిటని మంత్రిని ప్రశ్నించారు. దీంతో కారులో కూర్చున్న ఆయన.. ఆగ్రహంతో అందులో నుంచి దిగి ఆ రిపోర్టర్పైకి దూసుకొచ్చారు.
ఇక్కడ ఎవరు ఇంటర్వ్యూ ఇచ్చారు? మూడు గంటలపాటు ఎవరు ఎదురుచూశారు? అని ఆవేశంగా ఆ విలేఖరిని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా ఈ వ్యవహారాన్నంతా తన ఫోన్లో వీడియో తీస్తున్న వ్యక్తి పట్లా దురుసుగా వ్యవహరించారు. ఈ వీడియోను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో అది ప్రస్తుతం విపరీతంగా చక్కర్లు కొడుతున్నది.