‘సినిమా ఎంత గ్రాండియర్గా ఉంది అనేది ముఖ్యం కాదు, సినిమాలో ఎమోషన్స్ ఏస్థాయిలో ఉన్నాయి అనేదే ముఖ్యం. సినిమాను ప్రేక్షకుడికి దగ్గర చేసేది ఎమోషన్స్ మాత్రమే’ అంటున్నారు దర్శకుడు ఆర్.ఎ.వెంకట్. ఆయన దర్శకత్వంలో స్రవంతి రవికిశోర్ నిర్మించిన తమిళ చిత్రం ‘కిడ’. ఈ చిత్రాన్ని ‘దీపావళి’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్బంగా దర్శకుడు ఆర్.ఎ.వెంకట్ విలేకరులతో మాట్లాడారు.
‘ఓ సారి స్నేహితులతో కలిసి ఓ సినిమా చూస్తున్నాను. ఆ సమయంలో నా మనసులో మెదిలిన ఆలోచనే ఈ సినిమా. పల్లెటూరు, మేకలు పెంచుకునే ఓ ముసలాయన, ఆయనకు ఓ మనవడు, వారు ప్రేమగా పెంచుకునే ఓ మేకపిల్ల.. ఈ అంశాలే ఈ కథకు ఆయుధాలు. అదే నా ‘కిడ’ సినిమా’ అన్నారు వెంకట్.
తెలుగులో ఎన్నో అగ్ర చిత్రాలను నిర్మించిన రవికిశోర్గారు నా సినిమాను నిర్మిస్తారని కలలోకూడా అనుకోలేదని, ఆయన సహకారం వల్లే ఈ సినిమాను ఇంతబాగా తీయగలిగానని వెంకట్ చెప్పారు. .గోవా చలనచిత్రోత్సవాల్లో, చెన్నయ్ చలనచిత్రోత్సవాల్లో, మెల్బోర్న్ చలనచిత్రోత్సవాల్లో ఈ సినిమాను ప్రదర్శించి ప్రశంసించాని వెంకట్ తెలిపారు. త్వరలో స్రవంతి సంస్థలోనే మరో సినిమా చేయబోతున్నానని వెంకట్ చెప్పారు.