వైవిధ్యమైన కథాంశాల్ని ఎంచుకుంటూ ప్రతిభావంతురాలైన నాయికగా గుర్తింపును సంపాదించుకున్న పంజాబీ సుందరి తాప్సీ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ‘అవుట్సైడర్ ఫిల్మ్స్’ పేరుతో నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించింది. తన మిత్రుడు, కంటెంట్ క్రియేటర్ అయిన ప్రంజల్తో కలిసి నిర్మాణ సంస్థను ఆరంభించానని తాప్సీ ఇన్స్టాగ్రామ్లో పేర్కొంది. తొలి ప్రయత్నంగా ‘బ్లర్’ పేరుతో ఓ చిత్రాన్ని జీస్టూడియోస్తో కలిసి నిర్మిస్తున్నానని ఆమె తెలిపింది. తాప్సీ మాట్లాడుతూ ‘పరిశ్రమలో పదేళ్లుగా నా ప్రయాణం సాగుతోంది. ఇంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. చిత్రసీమకు నావంతుగా ఏదైనా తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది. అందుకే నిర్మాతగా మారుతున్నా. నటనతో పాటు ఇకపై నిర్మాతగా కూడా ప్రయాణం సాగిస్తాను. అందుకు మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని తాప్సీ పేర్కొంది. ‘బ్లర్’ చిత్రానికి అజయ్భల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాప్సీ ఇటీవలే ‘హసీన్ దిల్రుబా’ చిత్రంతో ప్రేక్షకులముందుకొచ్చింది. భారతీయ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా రూపొందిస్తున్న ‘శభాష్ మితు’ చిత్రంలో తాప్సీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలో విడుదలకానుంది.