Muslim Population | న్యూఢిల్లీ, మే 9: దేశంలో 1950-2015 మధ్య ముస్లింల జనాభా 43.15 శాతం పెరిగినట్టు కేంద్రం విడుదల చేసిన డాటా ఎన్నికల్లో రాజకీయ అస్త్రంగా మారింది. అటు అధికార బీజేపీ, ఇటు విపక్ష కాంగ్రెస్ కూటమి పరస్పర విమర్శలకు దిగాయి.
ఈ కారణంగానే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ తహతహలాడుతున్నదని బీజేపీ విమర్శలు చేయగా, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ వివరాలను ప్రకటించి దేశంలో మత చిచ్చును తేవడానికి కమలం పార్టీ ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్ ఆరోపించింది. కాగా, ఎన్నికల సమయంలో ఇలాంటి నివేదిక వెలువడటం రాజకీయ లబ్ధి పొందడానికేనని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ బీజేపీపై మండిపడ్డారు.