రంగారెడ్డి, మే 4, (నమస్తే తెలంగాణ) : కరోనా కట్టడికి రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తూనే పరీక్షలు, కొవిడ్ కేర్ కేంద్రాల ఏర్పాటుకు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నది. మూడు రోజులుగా నిలిచిన వ్యాక్సినేషన్ ప్రక్రియ మంగళవారం తిరిగి ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఒక్కో ప్రభుత్వ దవాఖానలో రోజుకు వంద మందికి వ్యాక్సినేషన్ చేయనున్నారు. మరో పది వ్యాక్సినేషన్ కేంద్రాలను పెంచేందుకు ప్రతిపాదించారు. సోమవారం సాయంత్రం నుంచి కొవిన్ యాప్ వ్యాక్సిన్ కేంద్రాల వివరాలు అందుబాటులోకి రావడంతో వ్యాక్సిన్ వేసుకునేందుకుగాను పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 4.10 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. జిల్లాలోని 49 ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది.
అందుబాటులోకి కొవిడ్ కేర్ కేంద్రాలు..
ప్రతీ రెవెన్యూ డివిజన్లో ఒక కొవిడ్ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 36 గంటల్లోనే 38 పడకల కొవిడ్ చికిత్స కేంద్రాన్ని జల్పల్లి మున్సిపాలిటీలోని పహాడీషరీఫ్లోని ప్రీమియర్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లాలోని ప్రతీ రెవెన్యూ డివిజన్లో కొవిడ్ కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, 375 పడకలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించారు. మిగతా కొవిడ్ కేర్ కేంద్రాలు ఒకట్రెండు రోజుల్లో అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది.
వనస్థలిపురంలోని ఏరియా దవాఖానలో మరో 25 పడకలు, చేవెళ్ల ప్రభుత్వ దవాఖానలో 25 పడకలు, మహేశ్వరం ప్రభుత్వ దవాఖానలో 25 పడకలు, షాద్నగర్ ప్రభుత్వ దవాఖానలో 50 పడకలు, రాజేంద్రనగర్ ప్రభుత్వ దవాఖానలో 25 పడకలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రతీ కొవిడ్ కేర్ కేంద్రంలో 48 గంటలపాటు ఆక్సిజన్ నిల్వలు ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో రోజుకు 2100 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. హోం ఐసోలేషన్లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కిట్స్ను అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 61 కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారితోపాటు వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ వివరాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంపీ రంజిత్రెడ్డి చొరువతో కొండాపూర్ జిల్లా దవాఖానకు ఆక్సిజన్ ప్లాంట్ మంజూరైంది. రూ. కోటీ విలువ గల ఈ ప్లాంట్ను తొందరల్లోనే ఏర్పాటు చేయనున్నారు.
రిజిస్ట్రేషన్ చేసుకునే రావాలి..
రిజిస్ట్రేషన్ చేసుకొని, స్లాట్ బుక్ చేసుకుని వ్యాక్సినేషన్ కేంద్రాలకు రావాలి. ఒక్కో కేంద్రంలో రోజుకు వంద మందికి వ్యాక్సిన్ అందిస్తున్నాం. ప్రస్తుతం 45 ఏండ్లకు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. సెకండ్ డోస్ తీసుకునే వారూ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఒకట్రెండు రోజుల్లో ప్రతిపాదించిన అన్ని కొవిడ్ కేర్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తాం.