లక్నో: ఉత్తరప్రదేశ్లో అక్రమ మద్యం తయారు చేస్తూ నలుగురు మృత్యువాత పడ్డారు. మొరదాబాద్ జిల్లాలోని రాజ్పూర్ కెసారియాలోని ఓ ఇంట్లో అక్రమంగా మద్యం తయారు చేస్తుండగా విషపూరిత వాయువులు వెలువడ్డాయి. దీంతో వారంతా అక్కడికక్కడే మృతిచెందారు. రాజ్పూర్ కెసారియా గ్రామానికి చెందిన రాజేంద్ర సింగ్ గత కొంతకాలంగా అక్రమ మద్యం తయారు చేస్తున్నాడు. దీనికోసం తన ఇంటి బేస్మెంట్లో ఓ గదిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో నిన్న రాజేంద్ర సింగ్తోపాటు అతని ఇద్దరు కుమారులు, ఓ కూలీ అందులోకి వెళ్లారు. అయితే అక్కడ ఆవు పెండ, రసాయన పదార్థాలు నిలువ ఉంచారు. దీంతో విషపూరిత వాయువులను పీల్చుకుని నలుగురు అపస్మారక స్థితిలో ఉన్నారు. వారిని గమనించిన రాజేంద్ర సింగ్ భార్య ఫూల్వతి ఇరుగుపొరుగువారికి చెప్పింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే వారు మృతిచెందారు.
కాగా, ఏడాది క్రితం రాజేంద్ర సింగ్ ఇంట్లో 250 బాక్సుల అక్రమ మద్యం లభించడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా అతడు అదే పనిచేస్తున్నాడని మొరదాబాద్ ఎస్ఎస్పీ పవన్ కుమార్ వెల్లడించారు. విషపూరిత వాయువులు పీల్చుకోవడంతోనే నలుగురు మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.