sukesh chandrasekhar | మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేశ్ చంద్రశేఖర్ ఓ బాలీవుడ్ నటిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశాడు. చాహత్ ఖన్నా ( Chahatt Khanna ) చేసిన తప్పుడు ఆరోపణల కారణంగా తన పరువు పోయిందని.. మానసికంగా తీవ్ర క్షోభ అనుభవించానని సుఖేశ్ పేర్కొన్నాడు. ఈ మేరకు సుఖేశ్ తన న్యాయవాది ద్వారా చాహత్ ఖన్నాకు లీగల్ నోటీసులు పంపించాడు. వారం రోజుల్లో తనకు క్షమాపణలు చెప్పాలని.. లేదంటే న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నోటీసులో హెచ్చరించాడు.
పలు హిందీ సీరియల్స్తో పాపులరైన చాహత్ ఖన్నా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. జాక్వెలిన్ తరహాలోనే తనను కూడా సుఖేశ్ మోసం చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపించింది. బలవంతంగా తిహార్ జైలుకు రప్పించి పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడని బయటపెట్టింది. ఢిల్లీలో ఈవెంట్ ఉందని చెప్పి పింకీ ఇరానీ అనే మహిళ తనను తిహార్ జైలుకు తీసుకెళ్లిందని చెప్పింది. అక్కడ జైలులో సుఖేశ్ చంద్రశేఖర్ తనను కలిశాడని పేర్కొంది. ఓ సౌత్ ఇండియా ఛానల్కు యజమానిని అని.. జయలలిలత మేనల్లుడిని అంటూ సుఖేశ్ పరిచయం చేసుకున్నాడని తెలిపింది. ఈవీఎం ట్యాంపరింగ్ కేసులో అరెస్టు అయినట్టు చెప్పాడని పేర్కొంది.
ఇక్కడకు ఎందుకు పిలిపించావని అడిగితే.. బడే అచ్చే లగ్తే హై సీరియల్లో తన నటన చూసి ఫిదా అయినట్లు తెలిపాడని చెప్పింది. మోకాలిపై కూర్చొని పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడని బయటపెట్టింది. దీంతో నాకు పెళ్లయ్యిందని.. ఇద్దరు పిల్లలు ఉన్నారని తనతో చెప్పానని పేర్కొంది. కోపంతో అక్కడి నుంచి వచ్చేశాక కొంతమంది తనను బ్లాక్ మెయిల్ చేశారని తెలిపింది. తిహార్ జైలులోకి వెళ్లిన వీడియోను చూపించి రూ.10 లక్షలు డిమాండ్ చేశారని చెప్పింది. విషయం బయటకు రావొద్దని వాళ్లు అడిగినంత ఇచ్చేశానని పేర్కొంది. కానీ విషయం తెలిసి తన భర్త విడిచిపెట్టాడని తెలిపింది. చాహత్ ఖన్నా చేసిన ఈ వ్యాఖ్యలపైనే ఇప్పుడు సుఖేశ్ చంద్రశేఖర్ పరువు నష్టం దావా వేశాడు.