బాలీవుడ్ ఇండస్ట్రీని వరుస పరాజయాలతో పాటు వివాదాలు కూడా వెంటాడుతున్నాయి. తాజా గా అక్షయ్కుమార్ నటించిన ‘రామ్ సేతు’ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. పౌరాణిక, చారిత్రక ప్రాశ స్త్యం కలిగిన రామ్సేతు వంతెన నేపథ్య కథాంశంతో యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 24న విడుదల కానుంది. ఈ సినిమాలో చారిత్రక ఘటనల్ని వక్రీకరిస్తూ, అవాసవాల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నాయకుడు సుబ్రమణియన్ స్వామి చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపించారు.
ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. ‘ముంబయి సినిమా వాళ్లకు వాస్తవాల్ని వక్రీకరించి చూపించే ఓ దురలవాటు ఉంది. ‘రామ్ సేతు’ కథను కల్పిత ఘటనలతో తెరకెక్కించారనే అనుమానంతో మేధోపరమైన హక్కుల పరిరక్షణ క్రింద నేను వారికి నోటీసులు పంపించాను’ అని సుబ్రమణియన్ స్వామి ట్విట్టర్లో పేర్కొన్నారు. సేతుసముద్రం ప్రాజెక్ట్ను ఆపేయాలని 2007లో సుబ్రమణియన్ స్వామి సుప్రీం కోర్టులో వాదించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల పౌరాణిక ప్రాధాన్యం కలిగిన రామ్ సేతు ధ్వంసం అవుతుందని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘రామ్ సేతు’ సినిమాలో కూడా చరిత్రను వక్రీకరించే అంశాలున్నాయని సుబ్రమణియన్ స్వామి తరపున కేసు వేసిన అడ్వకేట్ సత్య సబర్వాల్ అనుమానం వ్యక్తం చేశారు.