సాధారణంగా స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చినపుడు హీరోయిన్లు నో చెప్పరు. కానీ ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ సీనియర్ హీరోలతో నటించడానికి మాత్రం చాలా మంది హీరోయిన్లు నిర్మొహమాటంగా నో చెప్తున్నారు. చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్ లాంటి హీరోలతో నటించడానికి ఈ తరం హీరోయిన్లు ఎందుకో తటపటాయిస్తున్నారు. అందుకే వాళ్లకు హీరోయిన్లను వెతకడానికి చాలా తంటాలు పడుతున్నారు దర్శక నిర్మాతలు.
ఇదిలా ఉంటే బాలయ్య మాత్రం తనకు స్టార్ హీరోయిన్లే కావాలి అనుకోకుండా.. చిన్న హీరోయిన్లతోనే సర్దుకుపోతున్నాడు. అయితే ఈయనతో నటించడానికి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ నో చెప్పిందని తెలుస్తుంది. అఖండ సినిమా సంచలన విజయం సాధించడంతో బాలకృష్ణ జోరుమీదున్నాడు.
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు నందమూరి నటసింహం.
సంక్రాంతి తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలనుకున్నా కూడా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ మధ్యే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఆరు నెలల్లో సినిమా పూర్తి చేయాలని ఫిక్స్ అయిపోయాడు బాలకృష్ణ. దర్శకుడు గోపీచంద్ మలినేనికి కూడా ఇదే విషయం చెప్పాడు బాలయ్య. తనతో సినిమా అంటే ఆరు నెలల్లో ముగించాలి అంటున్నాడు.
ఈ సినిమా కన్నడ మఫ్టీ రీమేక్ అని ప్రచారం జరుగుతున్న వేళ అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు గోపీచంద్. ఇది తన సొంత కథ అని.. బాలయ్య కోసమే రాసానంటూ చెప్పుకొచ్చాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. తమన్ మరోసారి బాలకృష్ణ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఇందులో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని మరో కీలక పాత్ర కోసం అడిగితే నో చెప్పిందని తెలుస్తుంది. ఇందులో బాలయ్య కూతురు పాత్ర కోసం ఆమెను సంప్రదిస్తే.. సున్నితంగా తిరస్కరించిందని ప్రచారం జరుగుతుంది.
ఉప్పెన సినిమాను నిర్మించింది మైత్రి మూవీ మేకర్సే. తన తొలి చిత్ర నిర్మాతలు అడిగినా కూడా నో చెప్పింది ఈ ముద్దుగుమ్మ. లీడింగ్ హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో.. కారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తే ప్రభావం పడుతుందని కృతి భావిస్తుంది. అందుకే బాలయ్య సినిమాలో నటించడానికి నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా దాదాపు 50 కోట్లతో తెరకెక్కుతోంది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో వస్తున్న సినిమా ఇదే. కుదిర్తే 2022 దసరా లేదంటే 2023 సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.