‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకొని విశ్వవేదికపై భారతీయ సినిమా కీర్తిప్రతిష్టల్ని ఘనంగా చాటిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు రాజమౌళి పేరు కూడా ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతున్నది. ప్రస్తుతం ఆస్కార్ పురస్కారం తాలూకు ఆనందోత్సాహాల్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్న రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్పై ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. ఓ అంతర్జాతీయ ట్రేడ్ మ్యాగజైన్తో ముచ్చటించిన ఆయన సీక్వెల్పై మరింత వేగంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ‘ఆస్కార్ విజయం ఓ దర్శకుడిగా నాపై మరింత బాధ్యతను పెంచింది. సీక్వెల్కు సంబంధించిన పనుల్ని మరింత వేగవంతం చేసేలా స్ఫూర్తినిచ్చింది. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే’ అని రాజమౌళి పేర్కొన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సీక్వెల్ ఉంటుందని, అయితే అది ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో చెప్పలేనని గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు రాజమౌళి. తాజా వ్యాఖ్యలతో ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్పై ఆయన ప్రత్యేకంగా దృష్టిపెట్టబోతున్నారని అర్థ మవుతున్నది. రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేష్బాబుతో రూపొందించబోతున్న విషయం తెలిసిందే. జంగిల్ అడ్వెంచర్ నేపథ్య కథాంశంతో భారీ యాక్షన్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.