SS Rajamouli | ఆస్కార్ అవార్డుల వేడుకల నేపథ్యంలో దాదాపు మూడు నెలలు విదేశాల్లో గడిపిన అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం విరామ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తున్నారు. గత నెల రోజులుగా తమిళనాడులోని సుందరమైన పర్యాటక ప్రాంతాల్లో సేద తీరుతున్న ఆయన ఇటీవలే అక్కడి ప్రఖ్యాత దేవాలయాలను సందర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ఈ ఆధ్యాత్మిక యాత్ర తనకు మరపురాని జ్ఞాపకాల్ని మిగిల్చిందని రాజమౌళి ఆనందం వ్యక్తం చేశారు. ‘రోడ్డు ట్రిప్ ద్వారా తమిళనాడులోని దేవాలయాలను సందర్శించాలన్నది నా కల.
గత నెలలో మా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీరంగం, బృహదీశ్వరాలయం, రామేశ్వరం, తూత్తుకుడి, మధురై దేవాలయాలను సందర్శించాం. ఇక్కడి దేవాలయాల్లోని శిల్పకళా నైపుణ్యం, అద్భుతమైన కట్టడాలు నన్ను మంత్రముగ్ధుణ్ణి చేశాయి. చోళ రాజులు కళలను ఎంతగా ప్రోత్సహించారో ఈ దేవాలయాలను చూస్తే అర్థమైంది. రామేశ్వరం, కుంభకోణంలోని హోటల్స్లో భోజనాన్ని కూడా ఎంతగానో ఆస్వాదించా’ అని రాజమౌళి వీడియోలో చెప్పారు. రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేష్బాబుతో తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనుల్లో రాజమౌళి బిజీగా ఉన్నారు.