‘సూరిబాబు, శ్రీదేవి అనే జంట ప్రేమకథకు కుల అంతరాలు, గ్రామీణ రాజకీయాలు ఎలా అడ్డంకిగా నిలిచాయన్నది ఈ చిత్ర ఇతివృత్తం. నాయకానాయికలతో పాటు ప్రతి పాత్ర నిత్యజీవితంలో మనకు కనిపించే వ్యక్తులను పోలి రియలిస్టిక్గా ఉంటుంది’ అని అన్నారు విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి. వారు నిర్మించిన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. సుధీర్బాబు హీరోగా నటించారు. కరుణకుమార్ దర్శకుడు. ఈనెల 27న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘చిత్రీకరణ సమయంలో చాలా అవాంతరాలు ఎదురయ్యాయి. షూటింగ్ ఆరంభమైన తొలిరోజు కెమెరా రోడ్పై పడింది. ఆ తర్వాత రోజు కారావ్యాన్ అసిస్టెంట్ కరెంట్షాక్కు గురై గాయపడ్డాడు. మా సోదరుడు చనిపోయారు. అలా ప్రతి రోజు ఏదో ఒక అడ్డంకి ఎదురైంది. ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా సినిమాను పూర్తిచేశాం. ఓ సోడా సెంటర్ నేపథ్యంలో సాగే కథ ఇది. గోదావరి ప్రాంత నేపథ్యంలో వాస్తవిక కోణంలో ఉంటుంది. నిర్మాతలుగా ఒకే తరహా సినిమాలు చేయడం మాకు నచ్చదు. మంచి కథలు దొరక్కపోవడంతో సినిమాల మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నాం. తక్కువ సినిమాలే చేసినా ఎక్కువ రోజులు మాట్లాడుకునేలా ఉండాలి. అలాంటి సినిమాలే చేస్తాం. మణిశర్మను సంగీత దర్శకుడిగా తీసుకోవాలనే ఆలోచన మాదే. గ్రామీణ శైలికి తగినట్లుగా ఆయన వినూత్నమైన సంగీతాన్ని అందించారు. సుధీర్బాబుతో వ్యక్తిగతంగా చక్కటి స్నేహం ఉంది. కానీ సెట్స్లో మాత్రం నిర్మాత, హీరో బంధమే మా మధ్య కనిపిస్తుంది. మంచి కథలు కుదిరితే పెద్ద హీరోలతో సినిమాలు చేస్తాం’ అని తెలిపారు.