‘శ్రీదేవి శోభన్బాబు’ చిత్రంలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. తమిళ చిత్రం ‘జాను’లో నేను పోషించిన పాత్రకు పూర్తి భిన్నంగా ఉండే పాత్రను ఇందులో పోషించాను’ అన్నారు కథానాయిక గౌరి జి కిషన్. 96 చిత్రంలో ‘జాను’ పాత్ర ద్వారా నటిగా గుర్తింపు పొందిన గౌరి జి కిషన్ తెలుగులో నటిస్తున్న చిత్రం ‘శ్రీదేవి శోభన్బాబు’. ప్రశాంత్కుమార్ దర్శకుడు. కొణిదెల సుష్మిత, విష్ణుప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భగా గౌరి మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో నా పాత్ర ఎంతో వైవిధ్యంగా, వినోదాత్మకంగా ఉంటుంది. అన్ని కమర్షియల్ అంశాలతో రూపొందిన ఓ మంచి చిత్రం ద్వారా తెలుగులో పరిచయం కావడం ఆనందంగా వుంది.
సున్నితమైన అమ్మాయిగా ఉంటూనే ముక్కుసూటిగా మాట్లాడే పాత్ర నాది. తప్పకుండా ఈ చిత్రం తెలుగులో నాకు మంచి విజయాన్ని అందిస్తుందనే నమ్మకం వుంది. ’96’ సినిమా విడుదల తరువాత నా జీవితం మారిపోయింది. అన్ని భాషల్లో నటిగా అవకాశాలు వస్తున్నాయి. అందుకే అన్ని లాంగ్వేజ్లు నేర్చుకుంటున్నాను. ‘96’ విడుదలై నాలుగు ఏళ్లు గడిచినా అందరూ ఇప్పటికి నన్ను జాను అని పిలవడం ఆనందంగా వుంది’ అన్నారు.