Hero Sree Vishnu | కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథాంశాలను ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తున్నారు యువ హీరో శ్రీవిష్ణు. ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్లో తనదైన నటనతో మెప్పిస్తున్నారు. గురువారం శ్రీవిష్ణు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త చిత్రాలను ప్రకటించారు. ఈ రెండు చిత్రాలను గీతా ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు తెరకెక్కిస్తుండటం విశేషం.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ నిర్మిస్తున్న చిత్రానికి ‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్ కార్తీక్రాజు దర్శకత్వం వహించనున్నారు. విద్యా కొప్పినీడి, భానుప్రతాప, రియాజ్ చౌదరి నిర్మాతలు. శ్రీవిష్ణు నటిస్తున్న 18వ చిత్రమిది. చక్కటి ప్రేమకథతో వినోద ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నామని మేకర్స్ తెలిపారు.
శ్రీవిష్ణుతో ‘రాజ రాజ చోర’ వంటి హిట్ చిత్రాన్ని అందించాడు దర్శకుడు హసిత్ గోలి. వీరిద్దరి కాంబినేషన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ‘శ్వాగ్’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. గురువారం టైటిల్ను ప్రకటించడంతో పాటు కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. ఆద్యంతం హాస్యప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వేదరామన్ శంకరన్, సంగీతం: వివేక్సాగర్, సహనిర్మాత: వివేక్ కూచిబొట్ల, రచన-దర్శకత్వం: హసిత్ గోలి.