లాక్డౌన్ సమయంలో కొన్ని వేలమందికి సహాయాన్ని అందించి గొప్ప మనసును చాటుకున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. సోషల్మీడియా ద్వారా వచ్చిన అభ్యర్థనలపై కూడా స్పందించి సాయాన్ని అందించాడు. తాజాగా ఆయన అనాథ పిల్లల కోసం అంతర్జాతీయ స్థాయిలో ఓ పాఠశాలను కట్టించడానికి ముందుకొచ్చాడు. బీహార్కు చెందిన బీరేంద్ర కుమార్ మెహతా అనే యువ ఇంజనీర్ తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి అనాథ పిల్లల కోసం ఓ పాఠశాలను ఏర్పాటు చేశారు.
అయితే నిధుల కొరతతో సతమతమవుతూ ఆ విషయాన్ని సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇటీవలే ఈ స్కూల్ను సందర్శించిన సోనూసూద్.. బీరేంద్రకుమార్ సేవా భావానికి ముగ్దుడయ్యాడు. త్వరలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల భవనాన్ని కట్టిస్తానని మాటిచ్చాడు. విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూర్చుతానని చెప్పారు. కేవలం విద్య ద్వారానే దేశంలోని పేదరికాన్ని రూపుమాపగలమని సోనూ సూద్ పేర్కొన్నారు.