ముంబై: కరోనా మహమ్మారి బారినపడిన ప్రముఖ గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతామంగేష్కర్ ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆమె అత్యవసర చికిత్స పొందుతున్నారు. కరోనాకు తోడు ఆమెకు న్యుమోనియా కూడా ఉండటంతో వైద్యులు వెంటిలేటర్ అమర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆక్సిజన్ సపోర్టుతోనే శ్వాస తీసుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
కొవిడ్ పాజిటివ్గా తేలడంతో లతా మంగేష్కర్ను గత మంగళవారం బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అప్పటి నుంచి ఆమె అక్కడే చికిత్స పొందుతున్నారు. కరోనాకు తోడు ఆమెకు అంతకుముందే న్యుమోనియా కూడా ఉండటంతో సరిగా శ్వాస తీసుకోలేకపోతున్నారు. దాంతో వెంటిలేటర్ అమర్చారు. లతా మంగేష్కర్ ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. వైద్యులు ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆమె త్వరలో కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం అని ఆమెకు చికిత్స అందిస్తున్న ప్రధాన వైద్యుడు డాక్టర్ ప్రతీత్ సమ్దాని చెప్పారు.
అదేవిధంగా లతా మంగేష్కర్ మరికొన్ని రోజులు ఐసీయూలోనే ఉండాల్సి వస్తుందన్నారు. లతా మంగేష్కర్ హిందీ, మరాఠీ, బెంగాలీతోపాటు పలు ప్రాంతీయ భాషల్లో పాటలు పాడారు. నేపథ్య గాయనిగా సీనిరంగంలో ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. భారత రత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతోపాటు ఇంకా ఎన్నో పురస్కారాలను ఆమె అందుకున్నారు.