కోల్కతా : ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. లైవ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆ తర్వాత హోటల్ చేరుకున్న అనంతరం ఆయన కుప్పకూలిపోయాడు. రాత్రి 10.30 గంటల సమయంలో కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CMRI)కి తరలించగా.. అక్కడ వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అయితే, కేకే గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వస్తుండగా.. పూర్తి కారణాలు తెలియరాలేదు.
మరికొద్దిసేపట్లో ఆయన పార్థీవ దేహానికి ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం నివేదికలో మృతి గల కారణాలు స్పష్టంగా తెలియనున్నాయి. అయితే, కేకే మృతికి సంబంధించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కేకే ఆసుపత్రికి చేరిన సమయంలో తల, ముఖంపై గాయం గుర్తులున్నట్లు సమాచారం. గాయం ఎలా అయ్యిందనే తెలియాల్సి ఉంది. గాయం కారణంగానే మృతి చెందారా? లేదంటే గుండెపోటుతో మృతి చెందారా? అనే విషయం పోస్టుమార్టం నివేదికలో తేలిపోనున్నది.
మరో వైపు కేకే మరణంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు అసాధారణ మరణంగా కేసు నమోదు చేశారు. ఈవెంట్ నిర్వాహకులు, హోటల్ సిబ్బందిని పోలీసులు విచారించే అవకాశం ఉన్నది. ఇదిలా ఉండగా.. కేకే కుటుంబ సభ్యులు ముంబై నుంచి కోల్కతాకు చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం కేకే భౌతిక కాయాన్ని ముంబైకు తరలించనున్నారు. అయితే, విమానాశ్రయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గన్ సెల్యూట్ చేయనుందని సీఎం మమతా బెనర్జీ తెలిపారు.
West Bengal | Family of singer #KK reaches CMRI hospital in Kolkata where his body has been kept. pic.twitter.com/VN3a1Uch2R
— ANI (@ANI) June 1, 2022