ముంబై : బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే లీగల్ కేసులో ఇరుక్కున్న జంటపై తాజాగా మరో కేసు నమోదైంది. ముంబైలోని బాంద్రా పోలీస్స్టేషన్లో ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదైంది. పుణేకు చెందిన నితిన్ బరాయ్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు 420 (మోసం), 120-బీ (నేరపూరిత కుట్ర), 506 (నేరపూరిత బెదిరింపు)తో పలు కేసుల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తున్నది. త్వరలోనే శిల్పాశెట్టి, రాజ్కుంద్రాను పోలీసులు విచారించే అవకాశం ఉన్నది.
కేసు వివరాల్లోకి వెళితే.. జూలై 2014లో ఎస్ఎల్ఎఫ్ కంపెనీ డైరెక్టర్ కాషిఫ్ ఖాన్, శిల్పాశెట్టి, రాజ్కుంద్రా పలువురుతో కలిసి తమ కంపెనీ ఫ్రాంచైజీని తీసుకొని కోరెగావ్ ప్రాంతంలో స్పా, జిమ్ను తెరిస్తే లాభాలు వస్తాయని ఆశ చూపించారని సదరు వ్యక్తి ఆరోపించాడు. ఈ మేరకు రూ.1.59కోట్ల పెట్టుబడి పెట్టానని.. తన డబ్బును కాసిఫ్ఖాన్, శిల్పాశెట్టి, రాజ్కుంద్రా సొంత ప్రయోజనాలకు వినియోగించుకున్నారని, లాభాలు రాకపోవడంతో తన డబ్బును ఇవ్వమని అడిగితే బెదిరించారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించాడు.
ఇప్పటికే శిల్పాశెట్టి భర్త ఓ కేసులు బయట ఉన్న విషయం తెలిసిందే. అశ్లీల చిత్రాల కేసులో రాజ్కుంద్రా ఈ ఏడాది జూలైలో అరెస్టవగా.. సుమారు రెండు నెలల పాటు జైలు జీవితం గడిపారు. ప్రస్తుతం బెయిల్పై జైలు నుంచి బయటకు రాగా.. కొద్ది రోజుల కిందట శిల్పా, రాజ్కుంద్రా కుటుంబంతో కలిసి హిమాచల్ప్రదేశ్లో పర్యటించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆ తర్వాత ఈ ఘటన తర్వాత ఈ జంట బయట కలిసి కనిపించడం ఇదే తొలిసారి. కానీ, ముంబైకి పిల్లలతో కలిసి శిల్పా మాత్రమే తిరిగి వచ్చింది. రాజ్కుంద్రా జైలు నుంచి వచ్చిన తర్వాత బయట ఎక్కువ కనిపించడం లేదు. తాజాగా తన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను డిలీట్ చేశాడు. అంతకు ముందు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ భార్య శిల్పా, పిల్లలతో ఉన్న ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకునేవాడు.