‘ఇది అందర్నీ హ్యాపీగా నవ్వించాలని చేసిన సినిమా. చాలా క్లీన్ ఫిల్మ్. మంచి కథను అద్బుతమైన హ్యూమరస్గా చెప్పాడు దర్శకుడు రామ్ అబ్బరాజు. ఈ సినిమా నాకు నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చుతుందని నా నమ్మకం. టికెట్ ధరల్ని మేం పెంచడం లేదు. అందుబాబులో ఉన్న ధరలే ఉంటాయి. అందరూ ఈ సినిమాకొచ్చి ఆనందంగా నవ్వితే అదే మాకు అసలైన సంక్రాంతి.’
అని హీరో శర్వానంద్ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’. సంయుక్త మీనన్, సాక్షి వైద్య కథానాయికలు. ‘సామజవరగమన’ఫేం రామ్ అబ్బరాజు దర్శకుడు.
అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న సంక్రాంతి కానుకగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఏపీ ఆత్రేయపురంలో జరిగిన ఈవెంట్లో శర్వానంద్ మాట్లాడారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల హీరోయిన్లు సంయుక్త, సాక్షివైద్య ఆనందం వెలిబుచ్చారు. ఇంకా గీత రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా మాట్లాడారు.