ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్య కథాంశంతో హీరో శర్వానంద్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సంపత్నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్ నటిస్తున్న 38వ చిత్రమిది. తాజాగా ఈ సినిమా కోసం 15 ఎకరాల్లో భారీ సెట్ను నిర్మిస్తున్నారు. బుధవారం భూమి పూజతో సెట్వర్క్ను మొదలుపెట్టారు. ఉత్తర తెలంగాణ సంస్కృతిని, గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్ను తీర్చిదిద్దబోతున్నారు.
కళా దర్శకుడు కిరణ్ కుమార్ నేతృత్వంలో ఈ సెట్కు రూపకల్పన చేస్తున్నామని, ఇందులో ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను చిత్రీకరిస్తామని మేకర్స్ తెలిపారు. 1960 దశకంలో నడిచే పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇదని, ప్రేక్షకుల్ని ఆనాటి కాలంలోకి తీసుకెళ్తుందని, హీరో శర్వానంద్ సరికొత్త మేకోవర్లో కనిపిస్తారని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్రాజన్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, రచన-దర్శకత్వం: సంపత్నంది.