తెలుగు చిత్రసీమలో మరో విషాదం నెలకొంది. సీనియర్ ఎడిటర్ పి.వెంకటేశ్వరరావు (72) మంగళవారం మధ్యాహ్నం చెన్నైలో కన్నుమూశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 200లకు పైగా చిత్రాలకు ఆయన ఎడిటర్గా సేవలందించారు. ఎన్టీఆర్ నటించిన ‘యుగంధర్’ చిత్రంతో పాటు మొండి మొగుడు పెంకి పెళ్లాం, కెప్టెన్ కృష్ణ, ఇద్దరు అసాధ్యులు, ముద్దాయి వంటి హిట్ చిత్రాలకు ఆయన ఎడిటర్గా పనిచేశారు.
దక్షిణాదిలో అగ్ర దర్శకులతో కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తించారు. వెంకటేశ్వరావు మృతిపట్ల తెలుగు ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మార్తాండ్ కె వెంకటేష్ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు ఈ నెల 22న చెన్నైలో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.