సీనియర్ నటుడు మురళీమోహన్ 50 ఏండ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఏబీ ఎంటర్టైన్మెంట్ సంస్థ శుక్రవారం ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నటసింహ చక్రవర్తి బిరుదుతో సత్కరించింది. ఈ వేడుకకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ ‘మంత్రిగారి చేతుల మీదుగా ఈ సన్మానం జరగడం అదృష్టంగా భావిస్తున్నా. నటీనటుల ప్రతిభకు గుర్తింపుగా అవార్డులు ఇచ్చే సంప్రదాయం ఎప్పటి నుంచో వస్తున్నది. కొన్నేళ్లుగా అవార్డుల ప్రదానం ఆగిపోయింది.
ఈ ప్రభుత్వ హయాంలో అవార్డుల ప్రదానం మళ్లీ మొదలుపెట్టాలని కోరుతున్నా’ అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ ‘మంచి వ్యక్తిత్వం కలిగిన మురళీమోహన్గారిని సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. మురళీమోహన్గారు కోరినట్లు ముఖ్యమంత్రిని సంప్రదించి నంది అవార్డుల ప్రదానం గురించి చర్చిస్తాం. అలాగే ప్రభుత్వం నుంచి పరిశ్రమకు పూర్తి సహకారం అందిస్తూ అండగా ఉంటాం’ అన్నారు. ఈ ఏడాదితో తమ సంస్థ పదో వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుందని, ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని అవార్డు ఫంక్షన్లు నిర్వహిస్తామని వీబీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత విష్ణు బొప్పన తెలిపారు.