సుమంత్ హీరోగా రూపొందిన సూపర్హిట్ చిత్రం ‘సత్యం’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సూర్యకిరణ్ (48) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నయ్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. సూర్యకిరణ్ స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. సూర్యకిరణ్ సోదరి సుజిత ప్రస్తుతం బిజీ నటి. కథానాయిక కల్యాణిని సూర్యకిరణ్ ప్రేమవివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. ఇక సూర్యకిరణ్ విషయానికొస్తే.. అతను బాల్యం నుంచి నటిస్తూనే ఉన్నారు.
చిరంజీవి నటించిన పలు చిత్రాల్లో బాలనటుడిగా కనిపించారు. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ‘సత్యం’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి సినిమానే బ్లాక్బాస్టర్ కావడంతో సూర్యకిరణ్కి అవకాశాలు పోటెత్తాయి. ఆ తర్వాత ఆయన తీసిన ధన 51, బ్రహ్మాస్త్రం, రాజుభాయ్, చాప్టర్ 6 చిత్రాలు ప్రజాదరణకు నోచుకోలేదు. దాంతో వైవాహిక జీవితంతోపాటు, కెరీర్ కూడా డైలమాలో పడింది. అనుకోకుండా ఆరోగ్యం క్షీణించడంతో సూర్యకిరణ్ కన్నుమూశారు. ఆయన మరణం పట్ల తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం, తెలుగు సినిమా దర్శకుల సంఘం సూర్యకిరణ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.